25 June 2022 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

June 24, 2022

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - సత్యమైన తండ్రికి తమ సత్యాతి-సత్యమైన లెక్కాపత్రాన్ని ఇవ్వండి, ప్రతి విషయంలో శ్రీమతం తీసుకుంటూ ఉండండి, ఇందులోనే మీ కళ్యాణముంది’’

ప్రశ్న: -

ఇప్పుడు మీరు ఏ ఒప్పందము ఏ విధితో చేస్తారు?

జవాబు:-

సమర్పిత బుద్ధి కలవారిగా అయి ఇలా అంటారు, బాబా, నేను మీ వాడిని, ఈ తనువు-మనసు-ధనము అన్నీ మీవే. అప్పుడు బాబా అంటారు, పిల్లలూ, స్వర్గ రాజ్యాధికారం మీదే. ఇది ఒప్పందము. కానీ ఇందులో సత్యమైన హృదయం కావాలి. నిశ్చయము కూడా పక్కాగా ఉండాలి. తమ సత్యాతి-సత్యమైన లెక్కాపత్రాన్ని తండ్రికి ఇవ్వాలి.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవే తల్లివి-తండ్రివి… (తుమ్హీ హో మాతా పితా….)

ఓంశాంతి. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు – పిల్లలకు తెలుసు, ఇప్పుడు బ్రహ్మాకుమార-కుమారీలైన మేము శ్రీమతం యొక్క అర్థాన్ని అయితే తెలుసుకున్నాము, శివబాబా మతంతో మేము మళ్ళీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నాము. ఇది మీలోని ప్రతి ఒక్కరికీ తెలుసు – తప్పకుండా కల్ప-కల్పము పరమపిత పరమాత్మ వచ్చి బ్రహ్మా ద్వారా పిల్లలను దత్తత తీసుకుంటారు. మీరు దత్తత తీసుకోబడిన బ్రాహ్మణులు. వారి ఒడిలోకి తీసుకోబడినవారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మం, ఏదైతే కనుమరుగైపోయిందో, దానిని శ్రీమతంపై మనము మళ్ళీ స్థాపన చేస్తున్నాము మరియు ఖచ్చితంగా కల్పక్రితం వలె, ఏ పాత్ర అయితే కొనసాగుతుందో, శిక్షణ లభిస్తుందో, కల్పక్రితం వలె డ్రామానుసారంగా మనము పాత్రను అభినయిస్తున్నాము. మనం శ్రీమతంపై మన దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని తెలుసు. ఎవరెంత పురుషార్థం చేస్తారు అన్నదానిపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే సైన్యంలో కొందరు సతోప్రధాన పురుషార్థులు, కొందరు సతో, కొందరు రజో పురుషార్థులు ఉన్నారు. కొందరు మహారథులు, కొందరు గుర్రపు స్వారీ చేసేవారు, కొందరు పాదచారులు, ఈ పేర్లను పెట్టారు. మేము గుప్తంగా ఉన్నాము అని పిల్లలకు సంతోషం కలుగుతుంది. స్థూలమైన ఆయుధాలు మొదలైనవేవీ ఉపయోగించేది లేదు. దేవీలకు ఆయుధాలు మొదలైనవి ఏవైతే చూపిస్తారో, అవి జ్ఞానం యొక్క అస్త్ర-శస్త్రాలు. ఆయుధాలంటే దైహిక బాహుబలం అవుతుంది. ఆ దేవీలు స్థూలమైన ఖడ్గాలు మొదలైనవాటిని ఉపయోగించరని, వాటిని జ్ఞాన బాణాలు అంటారని మనుష్యులకు తెలియనే తెలియదు. చతుర్భుజునికి ఏ అలంకారాలనైతే చూపిస్తారో, వాటిలో కూడా జ్ఞాన శంఖము ఉంది, జ్ఞాన చక్రము, జ్ఞాన గద ఉన్నాయి. అవన్నీ జ్ఞానానికి సంబంధించిన విషయాలు. గృహస్థ వ్యవహారంలో కమల పుష్ప సమానంగా ఉండాలి అని కూడా అర్థం చేయించడం జరుగుతుంది, అందుకే కమల పుష్పాన్ని కూడా చూపిస్తారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా ఈ పాత్రను అభినయిస్తున్నారు. కమల పుష్ప సమానంగా గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఉండగా మీ బుద్ధిలో జ్ఞానముంది. మనము ఒక్క తండ్రిని స్మృతి చేస్తాము. ఇది కర్మయోగ సన్యాసము. తమ రచనను కూడా సంభాళించాలి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, ఇంతకుముందు దుఃఖానికి సంబంధించిన వ్యవహారమే ఉండేది, ఒకరికొకరు దుఃఖాన్నే ఇచ్చుకుంటూ ఉండేవారు. ఇక్కడి సుఖమైతే కాకి రెట్ట సమానంగా ఛీ-ఛీ అయినది. పేడ పురుగులు వలె అయ్యారు. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉందని పిల్లలు అర్థం చేసుకుంటారు. తండ్రి మనల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తారు. ఇప్పుడు మనము నరకానికి యజమానులుగా ఉన్నాము. నరకంలో ఏం సుఖం ఉంటుంది! పిల్లలైన మీరు ఇది వింటారు మరియు అర్థం చేసుకుంటారు. తండ్రి, పిల్లలకు ఈ జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు. పిల్లల కోసమే స్వర్గం ఉంది. పిల్లలే నంబరువారు పురుషార్థమనుసారంగా, మంచి రీతిలో అర్థం చేసుకుంటూ ఉండవచ్చు. మొట్టమొదట అయితే నిశ్చయం ఉండాలి. నిశ్చయబుద్ధి విజయంతి. నిశ్చయం పక్కాగా ఉన్నట్లయితే, వారు ఇక నిశ్చయంతోనే ఉంటారు. ఒకటేమో శివబాబా స్మృతి ఉంటుంది మరియు సంతోషం యొక్క పాదరసం ఎక్కి ఉంటుంది. సమర్పిత బుద్ధి కూడా ఉంటుంది. వారంటారు – బాబా, నేను మీ వాడిని, ఈ తనువు-మనసు-ధనము అన్నీ మీవే. తండ్రి కూడా – స్వర్గ రాజ్యాధికారము మీదే అని అంటారు. ఇది ఎలాంటి ఒప్పందమో చూడండి. సత్యమైన బిడ్డగా అవ్వాల్సి ఉంటుంది. పిల్లల వద్ద ఏముంది అనేది తండ్రికి అంతా తెలియాలి. మనం ఏం ఇస్తున్నాము! మీ వద్ద ఏముంది? తండ్రి మంచి రీతిలో అర్థం చేయిస్తారు. నేను పేదల పెన్నిధిని. షావుకార్లకు, ధనవంతులకైతే సమర్పితమవ్వాలంటే మనసులో దుఃఖము కలుగుతుంది. పేదవారైతే వెంటనే చెప్తారు కదా. ఎవరైతే వ్యాపారాలు మొదలైనవి చేస్తారో, వారు తమ సంపాదన నుండి ఒకటి రెండు పైసలను లేక నాలుగు పైసలను తీస్తారు. ఎవరికైతే దానం పట్ల అభిరుచి ఉంటుందో, వారు ధర్మార్థము ఎక్కువగా తీస్తారు. ఏది చేసినా ఈశ్వరార్పణం అని అంటారు, అందుకే వారికి అల్పకాలికమైన సుఖము మరుసటి జన్మలో లభిస్తుంది. ఎవరైనా కాలేజీలు, ధర్మశాలలు, హాస్పిటళ్ళు మొదలైనవి తయారుచేస్తే, వారికి మరుసటి జన్మలో దాని యొక్క ప్రతిఫలం లభిస్తుంది. పుణ్యాత్ములుగా అవుతారు కదా. వారి ఆరోగ్యం బాగుంటుంది. కాలేజిలో మంచి రీతిలో చదువుకుంటారు. అదంతా కూడా నేనే ఇస్తాను. సాక్షాత్కారాలు కూడా నేనే చేయిస్తాను. ప్రతి ఒక్కరి లెక్కాపత్రము కూడా నా దగ్గర ఉంది. డ్రామానుసారంగా ముందు నుండే నిశ్చితమై ఉంటుంది. ధనం ఎక్కువగా ఉంటే మందిరాలు మొదలైనవి కూడా తయారుచేస్తారు, అది ధర్మార్థము పక్కన పెట్టినట్లు అవుతుంది. తమ ఫ్యాక్టరీలు మొదలైనవాటి నుండి వచ్చే సంపాదన నుండి కొంత ధనాన్ని తీసి మందిరాలను తయారుచేయిస్తారు, కొందరేమో కాలేజీలు మొదలైనవాటిని తయారుచేయిస్తారు. ఈశ్వరార్థము దానం చేస్తాము, అప్పుడు ఈశ్వరుడు రిటర్నులో ఇస్తారు అని అంటారు. చాలామంది మనుష్యులు, మేము నిష్కామ సేవ చేస్తాము అని అంటారు. కానీ అది నిష్కామంగా అయితే ఉండదు. నిష్కామము అన్న పదం ఎక్కడి నుండి వెలువడింది? తండ్రి అర్థం చేయించారు – నిష్కామ సేవ అయితే జరగలేదు. ఫలం తప్పకుండా లభిస్తుంది. ఇప్పుడు మీరు గృహస్థ వ్యవహారంలోనైతే ఉండాల్సిందే. ఉద్యోగం చేయాలి, సంభాళించాలి. ఎంత మిగులుతుంది అని పిల్లలు తమ లెక్కాపత్రము మొదలైనవాటిని తండ్రికి ఇవ్వాలి. తండ్రి అంటారు, అచ్ఛా, మీరు పేదవారు, ఆదాయము మొదలైనవి లేవు, తమ రచన యొక్క పాలనను కూడా పూర్తిగా చేయలేకపోతున్నారు. అచ్ఛా, మీరు ఒక్క పైసానివ్వండి. ఇదే మీకు 21 జన్మల కోసము అవినాశీ సంపాదన. అదేమో అల్పకాలికమైన సుఖము కోసం ఉండేది, ఇది 21 జన్మల కోసం ఉంటుంది. మరియు ఇది డైరెక్టుగా చేసేది. తండ్రి అంటారు, మీరు బీజాన్ని అయితే నాటాల్సిందే. సుదాముడు పిడికెడు బియ్యాన్ని ఇచ్చారు, 21 జన్మల కోసం మహల్ లభించింది ఎందుకంటే అతను పేదవారు. ఒకవేళ షావుకారు పిడికెడు వజ్రాలను ఇచ్చినా, విషయము అంతే అవుతుంది. తండ్రి ఏమీ అనరు. ప్రతి ఒక్కరికీ ఎవరి డైరెక్షన్లు వారికి ఇస్తారు. మీరు ఇంత చేయండి అని చెప్తారు. ఖర్చులు ఎలా అవుతున్నాయి? అని కూడా అడుగుతారు. కొద్దిగా మిగిలితే దాని అనుసారంగా సలహానిస్తారు. తమ వద్ద అవసరానికి ఉపయోగపడేంత అయితే ఉండాలి. ఇంత చేయండి అని డైరెక్షన్ ఇస్తాను, ఆపై నేను బాధ్యుడిని. అచ్ఛా, ఇంట్లో ఏదైనా హాలు తయారుచేయండి, కుమార్తెలు వచ్చి అక్కడ సేవ చేస్తారు. హాస్పిటళ్ళను చాలా పెద్ద-పెద్దవిగా తయారుచేస్తారు, అలాగే ఇక్కడ కూడా పెద్దవిగా తయారుచేయాల్సి ఉంటుంది. చాలామంది వస్తారు. ఒకవేళ ఎక్కువ ధనం ఉన్నట్లయితే హాస్పిటళ్ళను, కాలేజీలను తెరవండి. గ్రామాన్ని బట్టి ఏర్పాట్లు ఉండాలి. ఎంతమంది పిల్లలు వచ్చి ఆరోగ్యము, ఐశ్వర్యము యొక్క వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఈ విధంగా చేయడం ద్వారా రాజ్యము లభిస్తుంది, చాలామంది కళ్యాణము జరుగుతుంది. 21 జన్మల కోసం మీరు ఈ విధంగా తయారవుతారు. పిల్లలనైతే పూర్తిగా సంభాళించాలి. సాధు-సన్యాసులకు ఇవేవీ ఉండవు. వారికి ఏదైతే ఇస్తారో, దానిని తమ పనుల్లోనే ఉపయోగిస్తారు. తమ సన్యాస కులాన్ని వృద్ధి చేసుకుంటారు, ఆశ్రమాలు మొదలైనవి తయారుచేసుకుంటారు. ఇక్కడ ఎవరు ఎంతగా కృషి చేస్తారో, అంతగా సింహాసనానికి యజమానులుగా అవుతారు. ఈ వారసత్వం లభిస్తుంది. పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారందరికీ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి కేవలం ఇదే అంటారు, పిల్లలూ, మీరు నన్ను మర్చిపోయారు కదా. మీరు ఎంతగా భ్రమించారు. రాయి-రప్పల్లో వెతుకుతూ-వెతుకుతూ మీ కాళ్ళను అలసిపోయేలా చేసుకున్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది, మళ్ళీ ఇలాగే జరుగుతుంది. సూర్యవంశీయులు వచ్చారు, చంద్రవంశీయులు వచ్చారు, ఆ తర్వాత వృద్ధి ఎలా జరుగుతూ వచ్చింది, జన్మలు ఎలా తీసుకుంటూ వచ్చారు, ఇదంతా మీ బుద్ధిలో ఉంది. భక్తి మార్గంలో కూడా ఫలాన్ని ఇచ్చేవాడిని నేనే. రాతితో చేసిన జడమైన మూర్తి ఏమిస్తుంది. ఇప్పుడు మీరు శూద్ర వర్ణము నుండి బ్రాహ్మణ వర్ణానికి చెందినవారిగా అయ్యారు.

మీకు తెలుసు, మనము శ్రీమతముపై మళ్ళీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నాము. కల్పక్రితము కూడా చేసాము. మళ్ళీ 84 జన్మల చక్రంలోకి వచ్చాము. ఇకపోతే, ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారికి చెందినవన్నీ ఉపకథలు. నాటకమంతా భారత్ పైనే ఉంది. మీరే దేవతలుగా ఉండేవారు, మీరే అసురులుగా అయ్యారు. రావణుడు ప్రవేశించడంతో వామ మార్గంలోకి పడిపోయి మీరు వికారులుగా అవుతారు. భ్రష్టాచారము మొదలవుతుంది. భ్రష్టాచారము కూడా మొదట సతోప్రధానంగా, ఆ తర్వాత సతో, రజో, తమోగా అవుతుంది. తండ్రి అర్థం చేయిస్తారు, ఈ సమయంలో మొత్తం వృక్షమంతా శిథిలావస్థను పొంది ఉంది. ఇప్పుడిది సమాప్తమయ్యేదే ఉంది. ఏ దేవతా ధర్మం అయితే లేదో, అది మళ్ళీ స్థాపన అవ్వనున్నది. కల్ప-కల్పము స్థాపన చేస్తారు. కానీ దీని వర్ణన పద్ధతి పూర్వకంగా లేదు. నంబరువన్ విషయము భగవానువాచ. భగవంతుడైతే ఒక్కరే ఉంటారు కదా. సర్వవ్యాపి జ్ఞానంతో భక్తి కూడా నడవలేదు. ఓ గాడ్, అని ఎవరిని అంటారు, సర్వవ్యాపి అయినట్లయితే ఓ గాడ్, అని కూడా అనలేరు. సతోప్రధానము నుండి మళ్ళీ సతో, రజో, తమోలలోకి రావాల్సిందే, అందుకే అందరూ పతితులుగా ఉన్నారు. పతిత-పావనా రండి, అని పాడుతారు కూడా. తండ్రి పావనంగా తయారుచేయడానికే వస్తారు. మీరు పావనంగా అవుతున్నారు. దుఃఖములో అందరూ స్మరిస్తారు. ఆపదలు సంభవించినప్పుడు ఓ భగవంతుడా, అని స్మృతి చేస్తారు కానీ వారి గురించి తెలియదు. మీకు జ్ఞానము లభిస్తూ ఉంది. మీరే మళ్ళీ దేవీ-దేవతలుగా అవ్వనున్నారు. ఇప్పుడిది వినాశన సమయము, అందరి లెక్కాచారాలు సమాప్తమవ్వనున్నాయి. ఇప్పుడు అందరూ నిర్జీవంగా ఉన్నారు, తండ్రి వచ్చి మేల్కొల్పుతారు. ఈ జ్ఞానము ఎవరి వద్దా లేదు. వస్తూ ఉంటారు, తయారవుతూ ఉంటారు, వృద్ధి జరుగుతూ ఉంటుంది. బాబాను అడగవచ్చు, ఈ పరిస్థితిలో నేను ఏ పదవిని పొందుతాను! అయితే, తమ అవస్థ ద్వారా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు అవకాశము చాలా ఉంది. మీరందరూ బాబాను స్మృతి చేసే విషయంలో పురుషార్థులు. పరిపూర్ణం (సంపూర్ణం) గా అయితే అంతిమంలో అవుతారు. పరీక్ష పూర్తవుతుంది, అప్పుడిక యుద్ధము మొదలవుతుంది. ఎప్పుడైతే మీరు సమీపంగా వస్తారో, అప్పుడు చాలామందికి సాక్షాత్కారాలు జరుగుతాయి. వీరు ఏ పదవిని పొందుతారు! అని ఒకరిది ఒకరు అర్థం చేసుకుంటారు. ఇది అర్థం చేసుకునే విషయము కదా. ఆత్మ తెలివిహీనంగా అయ్యింది. ఇప్పుడు మళ్ళీ తండ్రి గవ్వ నుండి వజ్రతుల్యంగా తయారుచేయడానికి తెలివైనవారిగా తయారుచేస్తారు. తండ్రి అంటారు, పిల్లలూ, ఇది యుద్ధ మైదానము, తుఫానులైతే చాలా వస్తాయి. అన్ని వ్యాధులు బయటకు వస్తాయి. తమ నైపుణ్యంలో తెలివైనవారిగా అవ్వండి.

ఉస్తాదు ఏమీ సహాయం చేయరు. ఓటమిని లేదా గెలుపును పొందడము మీ చేతుల్లోనే ఉంది. ఇది మాయ యుద్ధము అని ఉస్తాదు అంటారు. మాయ బాగా కింద పడేస్తుంది. వద్దనుకున్నా కూడా 5-6 సంవత్సరాలు బట్టి మంచిగా నడుస్తూ-నడుస్తూ ఉండగా ఇక ఎటువంటి తీవ్రమైన తుఫాను వస్తుందంటే అది నిద్రను కూడా వదిలించేస్తుంది. సాహసవంతులు అలసిపోకూడదు. ఫెయిల్ అవ్వకూడదు. వీటిపై చిన్న-చిన్న నాటకాలను కూడా చూపిస్తారు, భగవంతుడు తనవైపుకు ఎలా లాగుతారు, రావణుడు తనవైపుకు ఎలా లాగుతాడు అన్నది చూపిస్తారు. మీరు స్మృతిలో ఉండాలనుకుంటారు, మాయ తుఫానులలోకి తీసుకొస్తుంది, ఇదైతే జరుగుతుంది. యుద్ధము చేస్తూ ఉండాలి. మీరు కర్మయోగులు. ఉదయాన్నే లేచి అభ్యాసం చేయండి, తండ్రిని స్మృతి చేయండి. మీది గుప్తమైనది. గుప్త సైన్యము అని అంటూ ఉంటారు, అన్నోన్ వారియర్స్ బట్ వెరీ వెల్ నోన్ (గుప్త యోధులు కానీ బాగా ప్రసిద్ధి చెందినవారు). మీ స్మృతి చిహ్నమైన ఈ దిల్వాడా మందిరము, గుప్త యోధుల యొక్క స్మృతిచిహ్న మందిరము. ఇది లక్ష్మీనారాయణులది కాదు. వీరే మళ్ళీ లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. మీదంతా గుప్తము. స్థూలమైన ఖడ్గాలు మొదలైనవి ఏవీ లేవు, ఇందులో కేవలం బుద్ధికి సంబంధించిన పని ఉంది. ఆత్మలు పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారు… అని పాడుతారు కూడా. మనుష్యులైతే గురువులుగా అవుతారు. సద్గురువు అయితే ఒక్క నిరాకారుడు మాత్రమే. వారిని పతితపావనుడు అని అంటారు కనుక సద్గురువు అయినట్లే కదా. ఇకపోతే మిగిలినవారంతా కలియుగీ కర్మకాండలకు సంబంధించినవారు. పతితపావనా… అని అందరూ పిలుస్తారు, భజనలు చేస్తారు, సీతలందరికీ రాముడు ఒక్కరే. ఇప్పుడు మీ బుద్ధిలోకి మొత్తం జ్ఞానమంతా వచ్చింది. నాలో ఎటువంటి అవగుణం లేదు కదా అని తమ అవస్థను చూసుకోవాలి. క్రోధం యొక్క భూతము లేక కామం యొక్క భూతము ఉండకూడదు. ఏం జరుగుతుందో తెలియడం లేదు అని రాస్తారు! చాలా తుఫానులు వస్తాయి. బాబా అంటారు, ఇవైతే వస్తాయి, చాలా హైరానా పరుస్తాయి. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి, బాబాను స్మృతి చేయాలి. బాబా, మీదైతే అద్భుతము. మీరు రాజధానిని ఎలా స్థాపన చేస్తున్నారు అన్నది ఎవ్వరికీ తెలియదు. మనము భారత్ యొక్క ఈశ్వరీయ సేవాధారులము. నిరాకార శివ జయంతిని కూడా జరుపుకుంటారు. కానీ వారు ఎప్పుడు వచ్చారు మరియు ఎలా వచ్చారు, ఇది తెలియదు. శివబాబా మనకు ప్రజాపిత బ్రహ్మా ద్వారా వారసత్వాన్ని ఇస్తున్నారు అని మీకు తెలుసు. ఇది తాతగారి వారసత్వము. చాలా వరకు వారిని బాబా-బాబా అని అంటారు. దాదా మరియు బాబా. బాబా ఆత్మికమైనవారు, దాదా దైహికమైనవారు. ఆ పరమ ఆత్మ వీరి ద్వారా వారసత్వాన్ని ఇస్తున్నారు, ఇది బుద్ధిలో ఉండాలి. శ్రీమతంపై నడుచుకోవాలి. మన్మనాభవ మరియు చక్రం యొక్క రహస్యం కూడా సహజమైనది. స్వదర్శన చక్రధారులుగా కూడా అవ్వాలి. స్వదర్శన చక్రధారులు మీరు, కానీ అలంకారాలను విష్ణువుకు చూపించారు ఎందుకంటే ఇప్పుడింకా మీరు సంపూర్ణులుగా అవ్వలేదు. మొదటైతే ఈ నిశ్చయము కావాలి, వారు మనకు తండ్రి, టీచరు, మనకు శిక్షణ ఇస్తున్నారు. సద్గురువు తమతో పాటు తీసుకువెళ్తారు. వారికంటూ తండ్రి, టీచరు, సద్గురువు ఎవరూ లేరు. ఎంత స్పష్టంగా అర్థం చేయించడం జరుగుతుంది, అయినా బుద్ధిలో కూర్చోదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ నిర్మోహిగా అవ్వాలి. మనమైతే ఒక్క తండ్రికి చెందినవారిగా అయ్యాము, ఇదే బుద్ధిలో ఉండాలి. మీరు అంధులకు చేతికర్రగా అవ్వాలి. మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరితోనైనా మాట్లాడుతూ-మాట్లాడుతూ ఇదే అడగండి, పతితపావనుడైన పరమపిత పరమాత్మతో మీకు ఏం సంబంధముంది? మీ లౌకిక తండ్రి అయితే వారు కదా. మరి పరమపిత పరమాత్మ ఎవరికి తండ్రి? తప్పకుండా మా తండ్రి అని అంటారు. అచ్ఛా, తండ్రి అయితే స్వర్గ రచయిత. భారత్ స్వర్గంగా ఉండేది, ఇప్పుడు అలా లేదు. మళ్ళీ అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి, ఇది మీ హక్కు. స్మృతి చేయడంతో మీరు అక్కడికి వెళ్ళిపోతారు. ఎన్ని పాయింట్లు ఉన్నాయి, వీటిని బుద్ధిలో ధారణ చేయాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. లోపల ఏవైనా కామము లేక క్రోధం యొక్క అవగుణాలు ఉన్నట్లయితే, వాటిని తొలగించి సత్యాతి-సత్యమైన ఈశ్వరీయ సేవాధారులుగా అవ్వాలి. తుఫానులలో జాగ్రత్తగా ఉండాలి. ఓడిపోకూడదు.

2. తండ్రి డైరెక్షన్లతో సుదాముని వలె పిడికెడు బియ్యాన్ని ఇచ్చి 21 జన్మల రాజ్యాధికారాన్ని తీసుకోవాలి.

వరదానము:-

ఏ విధంగానైతే తండ్రి అతి పెద్ద పరివారం కలవారు, కానీ ఎంత పెద్ద పరివారమో, అంతే అతీతంగా మరియు సర్వులకు ప్రియంగా ఉంటారు, అదే విధంగా తండ్రిని ఫాలో చేయండి. సంగఠనలో ఉంటూ సదా నిర్విఘ్నంగా మరియు సంతుష్టంగా ఉండేందుకు ఎంతటి సేవనో అంతే అతీతత్వము ఉండాలి. ఎవరు ఎంతగా కదిలించినా సరే, ఒకవైపు ఒకరు డిస్టర్బ్ చేస్తూ, మరొకవైపు మరొకరు చేస్తూ, ఎటువంటి పరిష్కారము లభించకపోయినా, ఎవరైనా అవమానపర్చినా, సంకల్పంలో కూడా స్థిరంగా ఉండాలి, అప్పుడు నిర్విఘ్న ఆత్మ అని అంటారు.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

ಹೃದಯದ ಆಸರೆ ತುಂಡಾಗದಿರಲಿ…….

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top