07 June 2021 TELUGU Murli Today – Brahma Kumari
6 June 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
‘‘మధురమైన పిల్లలూ - అమృతవేళ సమయం చాలా-చాలా మంచిది, అందుకే ఉదయాన్నే లేచి ఏకాంతంలో కూర్చొని బాబాతో మధురాతి-మధురమైన మాటలు మాట్లాడండి’’
ప్రశ్న: -
నిరంతర యోగులుగా అయ్యేందుకు ఏ జ్ఞానం చాలా సహాయం చేస్తుంది?
జవాబు:-
డ్రామా జ్ఞానము. ఏదైతే గడిచిపోయిందో, అది డ్రామాలో నిశ్చితము. కొద్దిగా కూడా స్థితి అలజడిలోకి రాకూడదు. ఎలాంటి పరిస్థితి అయినా, భూకంపం వచ్చినా కానీ, వ్యాపారంలో నష్టం కలిగినా కానీ, కొద్దిగా కూడా సంశయం ఉత్పన్నమవ్వకూడదు. ఇటువంటి వారిని మహావీరులని అంటారు. ఒకవేళ డ్రామాకు సంబంధించిన యథార్థ జ్ఞానం లేకపోతే కన్నీరు కారుస్తూ ఉంటారు. నిరంతర యోగులుగా అయ్యేందుకు డ్రామా జ్ఞానం చాలా సహాయం చేస్తుంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
ఓం నమః శివాయ…..
ఓంశాంతి. ఇప్పుడు పతిత ప్రపంచం యొక్క అంతం జరుగుతుందని, పావన ప్రపంచం ప్రారంభమవుతుందని పిల్లలు మంచి రీతిలో అర్థం చేసుకుంటారు. ఇది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. అంతేకాక, పిల్లలకు మాత్రమే ఈ డైరెక్షన్లు లేక శ్రీమతం లభిస్తుంది. ఎవరిస్తారు? ఉన్నతోన్నతమైన భగవంతుడు ఇస్తారు. పతితుల నుండి పావనులుగా అవ్వాలని వారు అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ జ్ఞానం మీ కోసమే ఉంది, మిగిలినవారంతా పతితులు. ఈ పతిత ప్రపంచం తప్పకుండా వినాశనమవ్వనున్నది. వికారులను పతితులు అని అంటారు. మీరు జన్మజన్మలుగా ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ వచ్చారు, అందుకే మీరు ఆదిమధ్యాంతాలు దుఃఖం పొందారని తండ్రి అర్థం చేయిస్తారు. ఒకరినొకరు పతితులుగా చేసుకుంటారు. మేము పతితులము అని కూడా పిలుస్తారు కానీ బుద్ధిలో పూర్తిగా కూర్చోదు. ఓ పతితపావనా రండి, అని కూడా అంటారు కానీ పతితత్వాన్ని వదలరు. పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయమని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇది అర్థం చేయించేవారు కూడా ఎవరో ఉండాలి కదా. అర్థం చేయించేవారు ఒక్కరే. ఇకపోతే, ఈ గురువులు ఎవరైతే ఉన్నారో, వారు ఎవరినీ పావనంగా చేయలేరు. కేవలం ఒక్క జన్మ కోసమే పావనంగా అవ్వడం కాదు, జన్మజన్మలకు పావనంగా అవ్వాలి. మీలో కూడా జ్ఞానవంతులు ఎవరైతే ఉన్నారో, వారు చురుకుగా ఉంటారు. డ్రామానుసారంగా అది నిశ్చితము. మీలో కూడా మహావీరత ఉండాలి. అది తండ్రి స్మృతిలో ఉండడం ద్వారానే వస్తుంది. తండ్రి చాలా మంచి రీతిలో కూర్చొని అర్థం చేయిస్తారు. ఉదాహరణకు, ఉదయాన్నే లేచి స్మృతి చేయండి అని బాబా అంటారు. స్మృతి చేసేందుకు ఆ సమయం చాలా బాగుంటుంది, ఆ సమయాన్ని ప్రభాత సమయమని అంటారు. ఓ మనసా, ప్రభాత సమయంలో రాముడిని స్మరించు – అని భక్తి మార్గంలో కూడా అంటారు. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేసినట్లయితే చాలా ఆనందం కలుగుతుందని తండ్రి కూడా అంటారు. తండ్రి స్మృతిలో కూర్చొని ఎవరికి ఏ విధంగా అర్థం చేయించవచ్చు – అని ఆలోచించాలి. అమృతవేళలో వాయుమండలం చాలా శుద్ధంగా ఉంటుంది. పగలంతా వ్యాపార-వ్యవహారాలు ఉంటాయి. రాత్రి 12 గంటల వరకు వికారీ వాయుమండలం ఉంటుంది. సాధు-సత్పురుషులు, భక్తులు మొదలైనవారంతా ప్రభాత సమయంలోనే భక్తి చేస్తారు. వాస్తవానికి పగలు కూడా స్మృతి చేయవచ్చు. వ్యాపారం చేస్తున్నా కానీ, ఎవరు ఏ దేవతకు పూజారి అయితే, బుద్ధియోగం ఆ దేవత వద్ద ఉంటుంది. కానీ ఎవరికీ ఈ విధంగా ఉండటం లేదు. భక్తి మార్గంలో కేవలం దర్శనం కోసం శ్రమిస్తారు. కానీ, ఏమీ లభించదు. వారు కూడా భక్తి చేస్తూ-చేస్తూ తమోప్రధానంగా అవ్వాల్సిందే. భక్తి మార్గంలో కూడా శివునిపై బలిహారమవుతారు, దానిని కాశీ కల్వట్ (కత్తుల బావిలో దూకి మరణించడం) అని అంటారు. శివుడిని స్మృతి చేస్తూ-చేస్తూ బావిలో దూకేస్తారు. శివునిపై బలిహారమవుతారు. అది భక్తి మార్గంలోని బలి. ఇది జ్ఞాన మార్గంలోని బలి. అది కూడా కష్టమే, ఇది కూడా కష్టమే. దీని వలన భక్తి మార్గంలో ఎలాంటి లాభము లేదు. అది ఎలాంటిదంటే, ఆత్మ తన శరీరాన్ని హతమార్చుకున్నట్లే. ఇది జ్ఞానమేమీ కాదు. వారు కూడా ఆత్మయే పరమాత్మ అని అనేస్తారు. ఒక్క తండ్రి మాత్రమే ఆత్మాభిమాని, నేనొక్కడినే పరమాత్మను అని వారు పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మనైన నేనే పరమాత్మ అని అనడం అన్నింటికంటే పెద్ద అసత్యము. ఇది అసంభవము.
నేను పతితులను పావనంగా చేసేందుకే వస్తాను, ఇప్పుడు మళ్ళీ పావనంగా చేస్తున్నాను అని తండ్రి అంటారు. ఇకపోతే డ్రామాలో ఏది జరగాల్సి ఉంటే అదే జరుగుతుంది. ఒకవేళ భూకంపం వచ్చినా, ఇంటి పైకప్పు పడిపోయినా, ఇది నిశ్చితమై ఉందని, కల్పక్రితం కూడా ఇలాగే జరిగిందని అంటారు. ఇందులో కొద్దిగా కూడా చలించవలసిన అవసరం లేదు. డ్రామాపై పక్కాగా నిలబడి ఉండాలి. ఇలా ఉండేవారినే మహావీరులని అంటారు. ఏక్సిడెంట్లు మొదలైనవి చాలా జరుగుతూ ఉంటాయి. ఎవరినైనా రక్షించడం జరుగుతుందా? ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. డ్రామాలో వారి పాత్ర ఇలానే ఉంది. ఎవరికైతే డ్రామా గురించి తెలియదో, వారు దేహాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు కారుస్తారు. వారు ఎప్పుడూ శివబాబాను స్మృతి చేయలేరు ఎందుకంటే వారికి శివబాబా పట్ల ప్రేమ లేదు, సత్యమైన ప్రీతి లేదు. తండ్రి పట్ల పూర్తి ప్రీతి ఉండాలి. మీరు కల్ప-కల్పము శివబాబా పట్ల ప్రీతి బుద్ధి కలవారిగా అవుతారు. దేవతలకు తండ్రి పట్ల ప్రీతి బుద్ధి ఉండేదని ఎప్పుడూ అనరు. ఇప్పటి ప్రీతి కారణంగా వారు ఆ పదవిని పొందారు. అక్కడ వారికి అసలేమీ తెలియదు – శివబాబా పట్ల ప్రీతి పెట్టుకోవడానికి, మొత్తం కల్పంలో మీకు వారి గురించి అసలు తెలియదు. ఇప్పుడు తండ్రి వారి పరిచయాన్ని ఇచ్చారు. ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి నా ఒక్కరితోనే జోడించండి అని ఇప్పుడు తండ్రి అంటారు. ఇది తప్పకుండా వినాశన సమయమే. ఇది కూడా పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులు పూర్తిగా ఘోరమైన అంధకారంలో ఉన్నారు. మేమైతే తండ్రి నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి అని మీరిప్పుడు భావిస్తారు. స్మృతి లేకుండా సతోప్రధానంగా అవ్వలేరు. సర్జన్ గా అయి తమ రోగాన్ని చూసుకోవాలి. మాకు తండ్రి పట్ల ఎంత ప్రీతి ఉందని శ్రీమతమనుసారంగా చూసుకోవాలి. అమృతవేళ సమయంలోనే తండ్రిని స్మృతి చేయడం మంచిది. ప్రభాత సమయం చాలా మంచిది. ఆ సమయంలో మాయ తుఫాన్లు రావు. రాత్రి 12 గంటల వరకు తపస్సు చేయడం వల్ల లాభమేమీ లేదు, ఎందుకంటే ఆ సమయం అశుద్ధంగా ఉంటుంది. వాయుమండలం అశుద్ధంగా ఉంటుంది. కావున ఒంటి గంట వరకు వదిలేయాలి. ఒంటి గంట తర్వాత వాయుమండలం బాగుంటుంది. తండ్రి అంటారు – మీది సహజ రాజయోగం, కావున ప్రశాంతంగా కూర్చోండి. బాబాతో ఎలా మాట్లాడుతారు అని బ్రహ్మా బాబా వారి అనుభవాన్ని కూడా వినిపిస్తారు. బాబా, ఈ డ్రామా ఎంత అద్భుతమైనది! మీరు ఎలా వచ్చి పతితులను పావనంగా తయారుచేస్తారు! మొత్తం ప్రపంచాన్ని ఎలా పరివర్తన చేస్తారు! ఇది గొప్ప అద్భుతము! తండ్రికి ఎటువంటి ఆలోచనలు వస్తాయో, పిల్లలకు కూడా అటువంటి ఆలోచనలే రావాలి. మనుష్యుల నావలను తీరానికి ఎలా చేర్చాలి అనగా నావను తీరానికి ఎలా చేర్చాలి అన్న ఆలోచన కలగాలి. తండ్రి అంటారు – ఓ పతితపావనా రండి, అని మీరు పిలుస్తూ ఉంటారు, ఇప్పుడు నేను వచ్చాను, ఇప్పుడు మీరు పతితులుగా అవ్వకండి. పతితులుగా అయి సభలోకి వచ్చి కూర్చోకండి. లేదంటే వాయుమండలాన్ని పాడు చేస్తారు. బాబాకు అయితే తెలిసిపోతుంది. ఢిల్లీలో, బొంబాయిలో ఇలా వికారాలలోకి వెళ్ళేవారు వచ్చి కూర్చుండిపోయేవారు. అసురులు వచ్చి విఘ్నాలు వేసేందుకు కూర్చొనేవారని అంటూ ఉంటారు. వికారాలలోకి వెళ్ళేవారిని అసురులని అనడం జరుగుతుంది. వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. అలాంటివారికి చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి. బాబా అయితే అన్ని విషయాలను అర్థం చేయిస్తారు కానీ తమను తాము నష్టపర్చుకోకుండా ఉండరు. అబద్ధాలు కూడా చెప్తారు. లేదంటే వెంటనే – బాబా, మా ద్వారా ఈ తప్పు జరిగింది, క్షమించండి అని రాయాలి. మీరు చేసిన పాపాలు రాయండి లేదంటే అవి వృద్ధి చెందుతూ ఉంటాయి, పాతాళంలోకి వెళ్ళిపోతారు. ఏదో పొందాలని వస్తారు కానీ నష్టం కలిగించుకుంటారు. డ్రామాలో ఈ పాత్ర కూడా ఉంది. ఇలాంటి అసురులు కల్పక్రితం కూడా ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అమృతాన్ని వదిలి విషం తాగుతారు. స్వయాన్ని కూడా నష్టపర్చుకుంటారు, ఇతరులకు కూడా నష్టం కలిగిస్తారు. వాయుమండలాన్ని పాడు చేస్తారు. బ్రాహ్మణీలు కూడా అందరూ ఒకేలా లేరు. మహారథులు, గుర్రపు స్వారీ వారు, పాదచారులు అందరూ ఉన్నారు.
పిల్లలైన మీకు అపారమైన సంతోషముండాలి – బాబా లభించారు, ఇంకేమి కావాలి. పిల్లలు మొదలైనవారిని తప్పకుండా సంభాళించాలి. బాబా, వీరందరూ మీ వారే, ఇక మీరే సంభాళించండి, మేమైతే మీ వారిగా అయ్యాము అని అనకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి అని తండ్రి అర్థం చేయిస్తారు. ఎలాంటి పతిత కర్మలు చేయకండి. మొదటి విషయము, కామమునకు సంబంధించినది. దీని కారణంగానే ద్రౌపది కూడా – నన్ను నగ్నం చేస్తున్నారు, వచ్చి కాపాడండి అని పిలిచారు. అది కూడా, ఎప్పుడైతే వినేటువంటి తండ్రి వచ్చారో, అప్పుడే పిలిచారు. తండ్రి రాక ముందు ఎవరూ పిలవరు. ఎవరిని పిలుస్తారు? బాబా వచ్చారు కావుననే పిలుస్తారు. పతితుల నుండి పావనులుగా అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? తిరిగి వెళ్ళాలి, తిరిగి వెళ్ళే సమయం ఇదే. సర్వుల సద్గతిదాత, లిబరేటర్ ఒక్కరే. ఇక్కడ దుఃఖముంది. సాధు-సత్పురుషులు మొదలైనవారెవరూ సుఖంగా ఉండలేరు. అందరికీ ఏదో ఒక దుఃఖము, రోగము మొదలైనవి తప్పకుండా ఉంటాయి. కొందరు గురువులు అంధులుగా, కుంటివారిగా కూడా ఉంటారు. వారు తప్పకుండా అలాంటి పని ఏదో చేసారు కావుననే అంధులు, కుంటివారు మొదలైనవారిగా అవుతారు. సత్యయుగంలో అంధులు, కుంటివారు ఎవరూ ఉండరు. మనుష్యులు ఇది అర్థం చేసుకోరు. తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రియే జ్ఞాన సాగరుడు, పతిత పావనుడు. మిగిలినదంతా భక్తి. ఆ భక్తి మార్గమే వేరు. అది మెట్లు దిగే మార్గము. దిగేందుకు, జీవన బంధనంలోకి వచ్చేందుకు 84 జన్మలు పడుతుంది, ఆ తర్వాత జీవన్ముక్తులుగా అయ్యేందుకు ఒక్క క్షణం పడుతుంది. ఒకవేళ తండ్రి ఇచ్చే మతాన్ని అనుసరిస్తూ వారిని స్మృతి చేసినట్లయితే జీవన్ముక్తులుగా అవుతారు. నంబరువారుగా ఉంటారు కదా. మాకు ఫలానా టీచరు ఉంటే బాగుంటుందని అంటారు. అంటే వారు స్వయం బలహీనంగా ఉన్నారు కావుననే ఫలానా వారిని 2-4 నేలల కోసం పంపించండి అని అడుగుతారు. ఇది కూడా తప్పు అని బాబా అంటారు. తండ్రి ఎంత సహజమైన విషయాన్ని తెలియజేస్తున్నారు – కేవలం తండ్రిని స్మృతి చేయండి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పండి, ఇతరులకు కూడా అర్థం చేయించండి, అంతే. అయినా సరే, మీరు బ్రాహ్మణీని ఎందుకు స్మృతి చేస్తారు. ఇందులో బ్రాహ్మణి వచ్చి ఏం చేస్తారు? ఇది క్షణం విషయము. మీరు వ్యాపార-వ్యవహారాల్లో పడి దీనిని మర్చిపోయినప్పటికీ బ్రాహ్మణీ కూడా మన్మనాభవ అనే చెప్తారు. చాలా మంది తెలివిహీనులు అర్థం చేసుకోరు, కేవలం మంచి బ్రాహ్మణి కావాలి అని అడుగుతారు. మీకు జ్ఞానమైతే లభించింది కదా. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. దేహాభిమానాన్ని వదలండి. ఇది మా సెంటరు, ఇది వీరి సెంటరు, ఈ జిజ్ఞాసువు అక్కడికెందుకు వెళ్తున్నారు… ఇదంతా దేహాభిమానము. అన్నీ శివబాబా సెంటర్లే, ఏ సెంటరు మనది కాదు. ఫలానావారు మా సెంటరుకు ఎందుకు రావడం లేదు అని మీకెందుకు అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరినీ ఏమీ అడగొద్దు అని బాబా ఎప్పుడూ అంటారు. బీజం నాటకపోతే ఏమి లభిస్తుంది అనేది అర్థం చేసుకోగలరు. భక్తి మార్గంలో కూడా దాన-పుణ్యాలు చేస్తారు. మీరంతా భక్తి మార్గంలో ఇన్డైరెక్టుగా (పరోక్షంగా) ఈశ్వరార్థము దానం చేసేవారు. సన్యాసులకు కూడా చాలా ఇస్తారు. నిజానికి దానమనేది పేదవారికి ఇవ్వడం జరుగుతుంది కానీ షావుకారులకు కాదు. ధాన్యాన్ని దానం చేయడం అన్నింటికన్నా మంచిది. దానం చేస్తే దాని ఫలం మరుసటి జన్మలో లభిస్తుందని తండ్రి అర్థం చేయిస్తారు. ఈశ్వరుడే అందరికీ ఫలం ఇస్తారు. సాధు-సత్పురుషులు మొదలైనవారు ఎవరూ ప్రతిఫలాన్ని ఇవ్వలేరు. ఎవరి ద్వారా ఇచ్చినా సరే, ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. మీరు ఈశ్వరార్థము ఇచ్చినా మరుసటి జన్మలో మీకు దాని ప్రతిఫలాన్ని ఇచ్చేవాడినని తండ్రి అర్థం చేయిస్తున్నారు. కానీ ఇప్పుడైతే నేను డైరెక్టుగా వచ్చాను. ఇప్పుడు మీకు 21 జన్మలకు ప్రతిఫలం లభిస్తుంది. మృత్యువు అయితే ఎదురుగా నిలబడి ఉంది. మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది కావున తమదంతా సఫలం చేసుకోండి అని భక్తి మార్గంలో ఎవరూ చెప్పేవారు కాదు. కావున, ఎవరు కావాలనుకుంటే వారు ఈ ఆత్మిక హాస్పిటల్ ను తెరవండి అని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు. ఇల్లు కట్టించి, అందులో ఈ హాస్పిటల్ తెరుస్తాము అని కొందరు అంటారు. ఈ రోజు ఇల్లు కట్టించి, రేపు మరణించారంటే అదంతా సమాప్తమైపోతుందని తండ్రి అంటారు. శరీరంపై నమ్మకం లేదు. ఈ లోపు, ఏదైతే ఉందో అందులోనే ఒక గదిని ఏర్పాటు చేయండి, అందులో ఆత్మిక హాస్పిటల్, ఆత్మిక కాలేజీని తెరవండి. అనేకుల కళ్యాణం చేసినట్లయితే చాలా ఉన్నత పదవిని పొందుతారు. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శ్రీమతమనుసారంగా స్వయాన్ని చూసుకోవాలి – ఈ వినాశన సమయంలో నాకు ఒక్క తండ్రి పట్ల సత్యమైన ప్రీతి ఉందా? ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి ఒక్కరితోనే జోడించానా? ఎప్పుడైనా ఏదైనా వికర్మ చేసి అసురునిగా అవ్వడం లేదు కదా? ఇటువంటి చెకింగ్ చేసుకొని స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి.
2. ఈ శరీరంపై ఎలాంటి నమ్మకం లేదు కావున తమదంతా సఫలం చేసుకోవాలి. మీ స్థితిని ఏకరసంగా, అచలంగా తయారుచేసుకునేందుకు డ్రామా రహస్యాన్ని బుద్ధిలో పెట్టుకొని నడుచుకోవాలి.
వరదానము:-
ఎవరైతే నిష్కామ సేవాధారులుగా ఉంటారో, వారికి ఎప్పుడూ – నేను ఇంత చేసాను, దీని ద్వారా నాకు ఎంతోకొంత పేరు-ప్రతిష్టలు లేదా మహిమ లభించాలి….. అనే సంకల్పం రాదు. ఇలా అనుకోవడం కూడా తీసుకోవడమే. దాత పిల్లలు ఒకవేళ తీసుకోవాలి అనే సంకల్పం చేసినా, దాతగా అవ్వనట్లే. ఇచ్చేవారి విషయంలో తీసుకోవడమనేది శోభించదు. ఈ సంకల్పం సమాప్తమైనప్పుడు విశ్వ మహారాజ హోదా ప్రాప్తిస్తుంది. ఇటువంటి నిష్కామ సేవాధారులు, అనంతమైన వైరాగులే విశ్వకళ్యాణి, దయాహృదయులుగా అవుతారు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!