30 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

30 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

29 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు ఆత్మిక కార్యవ్యవహారాలను చేయాలి, ఆత్మగా భావిస్తూ ప్రతి కర్మను చేసినట్లయితే ఆత్మ నిర్వికారిగా అవుతూ ఉంటుంది’’

ప్రశ్న: -

స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మరియు స్వర్గంలో ఉన్నత పదవిని పొందేందుకు ఆధారమేమిటి?

జవాబు:-

బ్రహ్మాకుమార/కుమారీలుగా అయితే స్వర్గ వారసత్వం లభిస్తుంది. కానీ ఉన్నత పదవికి ఆధారం చదువు. ఒకవేళ తండ్రికి చెందినవారిగా అయి మంచి రీతిలో చదువును చదువుకుంటూ, పూర్తిగా పవిత్రంగా అయితే రాజ్య పదవి లభిస్తుంది. ఒకవేళ పూర్తిగా చదువుకోకపోతే, కర్మబంధనాలుంటే, పూర్తిగా పవిత్రంగా అవ్వకపోతే, ఈ లోపు శరీరాన్ని వదిలితే, ప్రజలలో కూడా సాధారణ పదవిని పొందుతారు.

♫ వినండి ఆడియో (audio)➤

ఓంశాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ ఆత్మిక కార్యవ్యవహారాలు ఉంటాయి. మిగతా ప్రపంచమంతటిలో దైహిక కార్యవ్యవహారాలు ఉంటాయి. వాస్తవానికి కార్యవ్యవహారాలనేవి ఆత్మలకు సంబంధించి జరుగుతాయి. ఆత్మనే ఈ శరీరం ద్వారా చదువుకుంటుంది, నడుస్తుంది, వికర్మలు చేస్తుంది, అందుకే పతితాత్మ, పాపాత్మ అని అంటారు. ఆత్మనే అంతా చేస్తుంది. ఈ సమయంలో మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు, నేను ఆత్మను అని అనుకునేందుకు బదులుగా నేను ఫలానా అని అనుకుంటారు. నేను ఈ వ్యాపారం చేస్తున్నాను లేక ఫలానావారు కామి, క్రోధి అని అంటారు. శరీరాల పేర్లు తీసుకుంటారు. దీనిని దేహాభిమాన ప్రపంచము, దిగే కళ యొక్క ప్రపంచము అని అంటారు. సత్యయుగంలో ఇలా ఉండదు. అక్కడ దేహీ-అభిమానులుగా ఉంటారు. మిమ్మల్ని దేహీ-అభిమానులుగా తయారుచేయడం జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మనైన నేను, ఈ శరీరం రూపీ వస్త్రాన్ని ధరించి పాత్రను అభినయిస్తాను. ఆ పాత్రధారులు కూడా రకరకాల వస్త్రాలను మారుస్తూ పాత్రను అభినయిస్తారు. తండ్రి అంటారు – ఆత్మలైన మీరు ముందు శాంతిధామంలో ఉండేవారు. మీ ఇల్లు శాంతిధామము. ఎలాగైతే ఆ హద్దు నాటకం ఉంటుందో, అలా ఇది అనంతమైన నాటకము. ఆత్మలందరూ పరంధామం నుండి వచ్చి, శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తారు. ఆత్మల అసలైన ఇల్లు పరంధామము. ఆ పాత్రధారుల ఇళ్ళు ఇక్కడే ఉంటాయి. కేవలం వస్త్రాలు మార్చుకుని వచ్చి పాత్రను అభినయిస్తారు. కావున తండ్రి కూర్చొని – మీరు ఆత్మలు అని అర్థం చేయిస్తారు. తండ్రి అయితే పిల్లలూ-పిల్లలూ అనే అంటారు. సన్యాసులు పిల్లలూ-పిల్లలూ అని అనరు. తండ్రి అంటారు – పతిత-పావనుడినైన నేను ఆత్మలైన మీ అందరి తండ్రిని, మీరు నన్ను గాడ్ ఫాదర్ అని అంటారు. గాడ్ ఫాదర్ నిరాకారుడు. బ్రహ్మా-విష్ణు-శంకరులను కూడా గాడ్ ఫాదర్ అని అనరు. వారిలో కూడా ఆత్మ ఉంటుంది కానీ వారిని బ్రహ్మా దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః…. అని అంటారు. దేవతలు ఏమి చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు పాత్రను ఎలా అభినయిస్తారు అనేది తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ప్రపంచం ఒక్కటే ఉంది. కింద పాతాళం లేక పైన వేరే ప్రపంచం ఉందని కాదు. ప్రపంచం ఒక్కటే, దాని చక్రం తిరుగుతూ ఉంటుంది. చంద్రునిపై ప్లాటు తీసుకుంటామని మనుష్యులు అంటూ ఉంటారు. పిల్లలు ఎంత నిరుపేదలుగా అయ్యారని తండ్రి అర్థం చేయిస్తారు. మీరు ఎంత షావుకారులుగా, వివేకవంతులుగా ఉండేవారు – అని భారతవాసుల కోసమే అంటారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం మొత్తం విశ్వమంతటిపైన ఉండేది, దానిని ఎవరూ దోచుకోలేరు. అక్కడ విభజనలు మొదలైనవేవీ ఉండవు. ఇక్కడ ఎన్ని విభజనలు ఉన్నాయి. పరస్పరంలో చిన్న-చిన్న ముక్కల కోసం కొట్లాడుకుంటూ ఉంటారు. మీరు మొత్తం విశ్వానికి యజమానులుగా ఉండేవారు. మొత్తం ఆకాశం, భూమి, సముద్రం అన్నీ మీవిగా ఉండేవి, మీరు వాటికి యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు ముక్కలుగా అయిపోయాయి. భారత్ యే విశ్వానికి యజమానిగా ఉండేదని ఎవరికీ తెలియదు.

తండ్రి అర్థం చేయిస్తారు – ఆత్మకు లభించిన పాత్ర ఎప్పటికీ అరిగిపోదు. నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు మళ్ళీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. అప్పుడు 84 జన్మలు తీసుకుంటారు. మీ పాత్ర కొనసాగుతూనే ఉంటుంది, ఎప్పటికీ ఆగిపోదు. మోక్షాన్ని ఎవరూ పొందరు. ఎంత ఎక్కువమంది గురువులు ఉంటారో, ఎంత ఎక్కువ శాస్త్రాలు ఉంటాయో, అన్ని రకాల మతాలు ఉంటాయి. మనుష్యులలో ఎంత అశాంతి ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే, మనసుకు శాంతి ఎలా లభిస్తుందని అడుగుతారు. దేహాభిమానంలోకి వచ్చి ఇలా అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు – మనస్సు మరియు బుద్ధి ఆత్మ యొక్క ఇంద్రియాలు. మిగిలినవన్నీ శరీరం యొక్క ఇంద్రియాలు. నా మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని ఆత్మ అంటుంది. నిజానికి ఇలా అనడం తప్పు. మీరు ఆత్మలు, మీ స్వధర్మమే శాంతి. ఆత్మనైన నాకు శాంతి ఎలా లభిస్తుందని అనండి. ఇక్కడ కర్మలు చేయాల్సిందే. ఈ విషయాలను తండ్రియే కూర్చొని అర్థం చేయిస్తారు. ప్రపంచంలో ఈ జ్ఞానం ఎవరికీ లేదు. అక్కడున్నది భక్తి మార్గము. వారికి జ్ఞానం గురించి తెలియదు. జ్ఞానాన్ని ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. తండ్రి స్వయంగా చెప్తారు – నేను కల్ప-కల్పము, కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను. కలియుగ అంతిమంలో అందరూ పతితులుగా ఉన్నారు. ఇది రావణ రాజ్యము. రావణుడిని కాల్చేది కూడా భారతవాసులే. పతిత-పావనుడైన తండ్రి జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది మరియు రావణుని జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది. రావణుడు అందరినీ పతితులుగా చేస్తాడు, అందుకే అతడిని కాలుస్తారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు.

ఇప్పుడు భారత్ లో కృష్ణ జయంతిని జరుపుకుంటారు. కృష్ణుని లీలలు, భజనలు మొదలైనవి చేస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు – వాస్తవానికి కృష్ణుని లీలలు అంటూ ఏమీ లేవు. కృష్ణుడు ఏమి చేసారు! కంసపురిలో జన్మించారని అంటారు. ఇప్పుడు కంసుడిని రాక్షసుడని అంటారు. సత్యయుగంలో రాక్షసుడు ఎక్కడి నుండి వస్తాడు. మీకు తెలుసు – సత్యయుగంలో ఉండే కృష్ణుని ఆత్మ, 84 జన్మలను అనుభవించి ఈ సమయంలో పతితం నుండి పావనంగా తయారవుతుంది. ఆ ఆత్మ తిరిగి తన పదవిని తీసుకుంటుంది. అలాగే మీరు కృష్ణపురిలో ఉండేవారు. 84 జన్మలు తీసుకొని, ఇప్పుడు మళ్ళీ మీ పదవిని తీసుకుంటున్నారు. వాస్తవానికి శివబాబా జయంతిని జరుపుకోవాలి. ఏ శివబాబా అయితే అందరినీ నరకం నుండి స్వర్గంలోకి తీసుకువెళ్తారో, వారి లీల ఏమీ లేదు. మీరు అంటారు – హే పతితపావన బాబా రండి, వచ్చి మమ్మల్ని నరకం నుండి స్వర్గంలోకి తీసుకువెళ్ళండి. మీరు మా తండ్రి కనుక మేము స్వర్గంలో ఉండాలి కానీ ఈ వికారీ ప్రపంచంలో ఎందుకు ఉన్నాము? అందుకే, ఓ గాడ్ ఫాదర్, మమ్మల్ని ఈ దుఃఖపు ప్రపంచం నుండి విడిపించండి అని పిలుస్తారు. ఇది కూడా డ్రామాలో నిశ్చయించబడి ఉంది. తండ్రి అంటారు – ఈ డ్రామా గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాలలో డ్రామా ఆయువును ఎక్కువగా రాసేసారు. కొత్త ప్రపంచం పాతగా అవ్వాల్సిందే. సతో, రజో, తమోలలోకి రావాల్సిందే. ఇది అనంతమైన విషయము. ఇప్పుడు మీరు మళ్ళీ విశ్వానికి యజమానులుగా అవుతున్నారు. కొత్త ప్రపంచంలో ఉండే భారతవాసులే 84 జన్మల పాత్రను అభినయిస్తారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అవుతారు, మిగిలిన మనుష్యులందరూ పతితులుగా ఉన్నారు, అందుకే పావనమైనవారి ఎదురుగా వెళ్ళి నమస్కరిస్తారు. పావనమైనవారికి పావనంగా ఉన్నవారు ఎందుకు నమస్కరిస్తారు. సన్యాసులు పావనమైనవారు, అందుకే పతిత మనుష్యులు వారి ముందు తల వంచుతారు. కన్య పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ ఆమె ముందు తల వంచుతారు. ఆ కన్యనే వివాహం చేసుకొని అత్తవారింటికి వెళ్తే, ఆమె అందరికీ తల వంచి నమస్కరించాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరినీ పావనంగా చేయడానికి అనంతమైన తండ్రి వచ్చారు. వారంతా కలియుగంలో ఉన్నారు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇప్పుడు మీరు పతిత ప్రపంచంలోకి వెళ్ళకూడదు. ఇది కళ్యాణకారీ యుగము. తండ్రి వచ్చి అందరి కళ్యాణం చేస్తారు. ఇప్పుడు మీరు కృష్ణ జయంతిని జరుపుకుంటారు, అలా చేయకపోతే మనుష్యులు మిమ్మల్ని నాస్తికులు అని అనుకుంటారు. నిజానికి, తమ తండ్రి గురించి మరియు రచన ఆదిమధ్యాంతాల గురించి తెలియనివారిని నాస్తికులు అని అంటారు. ఈ సమయంలో అందరూ అనాథలుగా అయిపోయారు. ప్రతి ఇంట్లో గొడవలు ఉన్నాయి, ఒకరినొకరు కొట్టుకోవడానికి వెనుకాడరు, అందుకే దీనిని నాస్తికుల ప్రపంచమని అంటారు. వారు తండ్రి గురించి తెలియనివారు, మీరు తండ్రి గురించి తెలిసినవారు. మేము రాతిబుద్ధి కలవారిగా ఉండేవారము, తండ్రి మమ్మల్ని పారసబుద్ధి కలవారిగా చేస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఇందులో ఇంకే కష్టము లేదు. తండ్రి అంటారు – కేవలం ఒక గంట చదువుకోండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి. శరీరాన్ని స్మృతి చేస్తే లౌకిక సంబంధీకులు గుర్తుకొస్తారు. దేహీ-అభిమానులుగా ఉంటే తండ్రినైన నా స్మృతి ఉంటుంది. ఇది వికారీ ప్రపంచము. ఇక్కడ విషయ సాగరంలో మునకలు వేస్తూ ఉంటారు. విష్ణువును క్షీర సాగరంలో చూపిస్తారు. అక్కడ నేతి నదులు ప్రవహిస్తాయని అంటారు. ఇక్కడైతే కిరోసిన్ కూడా లభించదు. తేడా ఉంది కదా. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. తండ్రియే నావికుడు కదా. నా నావను తీరానికి చేర్చండి అని పాడుతారు కూడా. ఇవన్నీ నావలే, నావికుడు ఒక్క తండ్రి మాత్రమే. ఈ శరీరాలను ఇక్కడే వదిలేస్తారు. ఇకపోతే, ఆత్మలను ఆవలి ఉన్న ఆ శాంతిధామానికి తీసుకువెళ్తారు. అక్కడి నుండి మళ్ళీ సుఖధామానికి పంపిస్తారు. పరమపిత పరమాత్మనే నావికుడని అంటారు. తండ్రి మహిమను అనేక రకాలుగా పాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు పవిత్రంగా అయి, పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. శ్రీ శ్రీ శివబాబా శ్రేష్ఠంగా తయారుచేసేందుకు వచ్చారు. ఇది భ్రష్టాచారీ ప్రపంచమని స్వయంగా భగవంతుడే అంటారు. ఇప్పుడు మీరు పరమపిత పరమాత్ముని శ్రీమతాన్ని అనుసరిస్తూ శ్రేష్ఠాచారులుగా అవుతారు. ఇవి ఎంత గుప్తమైన, రమణీకమైన విషయాలు, ఇవి పిల్లలైన మీకు మాత్రమే అర్థమవుతాయి. ఇతరులకు అసలు అర్థం కావు. ఇప్పుడు దేవీ-దేవతా ధర్మం యొక్క అంటు కట్టడం జరుగుతుందని మీకు తెలుసు. దేవీ-దేవతా ధర్మానికి చెందినవారు ఎవరైతే ఇతర ధర్మాలలోకి వెళ్ళిపోయారో, వారే వచ్చి మళ్ళీ బ్రాహ్మణులుగా అవుతారు. బ్రహ్మాకుమార-కుమారీలుగా అవ్వకుండా తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోలేరు. ఇప్పుడు బ్రహ్మాకుమార-కుమారీలైన మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఎంత పురుషార్థం చేస్తారో మరియు ఇతరులతో చేయిస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. అందరూ అంత చేయలేరు. పూర్తిగా చదువుకోకపోతే, ప్రతిఫలం ఏమవుతుంది. ఒకవేళ శరీరం వదిలేస్తే, స్వర్గంలోకి వస్తారు కానీ ప్రజలలో చాలా సాధారణమైన వారిగా అవుతారు. ఒకవేళ తండ్రికి చెందినవారిగా అయి, మంచి రీతిలో చదువుకుంటే రాజ్య పదవిని పొందగలరు. చదువుకోకపోతే, వారి అదృష్టంలో లేదని భావిస్తారు. పవిత్రంగా ఉంటూ, చదువుకుంటే ఉన్నత పదవిని పొందుతారు. అపవిత్రంగా అయితే తండ్రిని స్మృతి చేయలేకపోతారు. కర్మబంధనాల లెక్కలు సమాప్తమై, బండిలోని రెండు చక్రాలు పవిత్రంగా ఉంటే, సరిగ్గా వెళ్ళగలుగుతారు. ఇరువురూ పవిత్రంగా ఉంటే జ్ఞాన చితిపై కూర్చొంటారు, లేదంటే గొడవలు జరుగుతాయి.

చాలా మంది పిల్లలంటారు – బాబా, శ్రీకృష్ణుడు సత్యయుగంలోని మొదటి రాకుమారుడని మనకు తెలుసు కదా, మరి మనం ఈ వేడుకను ఎందుకు జరుపుకోకూడదు. అచ్ఛా, మనము కృష్ణుని ఆత్మను పిలవగలము కూడా. కృష్ణుని ఆత్మ వచ్చి ఆడుతుంది-పాడుతుంది, రాస్ చేస్తుంది, ఇంకా ఏమి చేస్తుంది. గోప-గోపికలైతే ఇక్కడే ఉంటారు. అక్కడ రాకుమార-రాకుమారీలు పరస్పరంలో కలిసినప్పుడు రాస్ చేస్తారు. బంగారు మురళిని వాయిస్తారు. ఈ ఆట-పాటలన్నింటినీ మీరు చివర్లో చూస్తారు. ఈ పాత్రలన్నీ నడుస్తాయి. ప్రారంభంలో చూపించడం జరిగింది, తర్వాత మీరు పురుషార్థంలో నిమగ్నమైపోయారు. ఇప్పుడు మళ్ళీ చివర్లో సాక్షాత్కారాలు జరగడం మొదలవుతాయి. ఎవరెవరు ఏ పదవిని పొందుతారు అనేది మీరు తెలుసుకుంటారు. తండ్రి కూర్చొని ఈ రహస్యాలన్నింటినీ అర్థం చేయిస్తారు. మీరు వేద-శాస్త్రాలను నమ్ముతారా అని మిమ్మల్ని అడుగుతారు. మీరు చెప్పండి – అవును, మేమెందుకు నమ్మము. ఇవన్నీ భక్తి మార్గపు సామగ్రి, వీటిలో జ్ఞానమేమీ లేదు. జ్ఞానమిచ్చేవారు ఒక్కరే. జ్ఞానం లభిస్తే భక్తి దానంతట అదే వదిలిపోతుంది. మీరు మందిరాలకు వెళ్ళినా సరే, ఈ లక్ష్మీనారాయణులు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రపంచంలో రాజ్యం చేస్తారని మీ బుద్ధిలో ఉంటుంది.

తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు – రెండు వైపులా సంబంధాలను నిర్వర్తించాలి, గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. పూర్తి పవిత్రులుగా అవ్వండి, పూర్తి వైష్ణవులుగా అవ్వండి మరియు విష్ణుపురి రాజ్యాన్ని తీసుకోండి అని శ్రీమతం చెప్తుంది. అచ్ఛా!

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. యోగం ద్వారా కర్మబంధనాల లెక్కాచారాలను సమాప్తం చేసుకొని పావనంగా అవ్వాలి. జ్ఞాన చితిపై కూర్చోవాలి. పూర్తి వైష్ణవులుగా అనగా పవిత్రులుగా అవ్వాలి.

2. తమ శాంత స్వధర్మంలో స్థితులవ్వాలి. అందరికీ శాంతిధామం యొక్క స్మృతిని కలిగించాలి. ఎప్పుడూ అశాంతి చెందకూడదు.

వరదానము:-

ఏ పిల్లలైతే జ్ఞానం ద్వారా రావణుని బహురూపాలను మంచి రీతిలో తెలుసుకున్నారో, వారి ముందుకు ఆ రావణుడు సమీపంగా కూడా రాలేడు. బంగారు రూపాన్ని ధారణ చేసినా లేక వజ్ర రూపాన్ని ధారణ చేసినా, వారు దాని ఆకర్షణలోకి రారు. ఇటువంటి సత్యమైన సీతలుగా అయి గీత లోపల ఉండే లక్ష్యాన్ని పెట్టుకొని, ధైర్యశాలిగా అవ్వండి. అప్పుడు ఈ రావణుని బహుసైన్యం దాడి చేసేందుకు బదులుగా మీకు సహయోగిగా అవుతుంది. ప్రకృతి యొక్క 5 తత్వాలు మరియు 5 వికారాలు ట్రాన్స్ఫర్ అయి, మీ సేవ కోసం వస్తాయి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top