29 July 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
28 July 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - ఈ భారత భూమి నిరాకార తండ్రి యొక్క జన్మ-భూమి. మీకు రాజయోగాన్ని నేర్పించి రాజ్యాన్ని ఇవ్వడానికి, మీకు సేవ చేయడానికి తండ్రి ఇక్కడికే వస్తారు”
ప్రశ్న: -
శివబాబా తన పిల్లలు ప్రతి ఒక్కరితోనూ ఏ ప్రతిజ్ఞను చేయిస్తారు?
జవాబు:-
మధురమైన పిల్లలూ, ప్రతిజ్ఞ చేయండి – బాబా, మేము ఎటువంటి వికర్మలు చేయము, మేము 5 వికారాలను దానం చేస్తాము అని. ఒకవేళ మేము దానమిచ్చి మళ్ళీ తిరిగి తీసుకున్నట్లయితే, చాలా పాపం తయారవుతుందని, దానికి కఠినమైన శిక్షలు అనుభవించవలసి ఉంటుందని లోపల భయముండాలి. హరిశ్చంద్రుని కథ కూడా దీని ఆధారంగానే తయారుచేయబడి ఉంది.
♫ వినండి ఆడియో (audio)➤
ఓంశాంతి. ఇది పిల్లల గాడ్లీ స్టూడెంట్ లైఫ్ (ఈశ్వరీయ విద్యార్థి జీవితం). మేము తండ్రి వద్దకు వచ్చామని పిల్లలకు తెలుసు. వారే వచ్చి కల్ప-కల్పము భారతవాసీ పిల్లలకు రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. భారత్ లోనే వస్తారు కదా. ఇది భారత భూమి. తమ సొంత భూమి పట్ల చాలా ప్రేమ, గౌరవముంటుంది. ఒకవేళ విదేశానికి చెందిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఇక్కడ మరణిస్తే, వారిని విదేశానికి తీసుకువెళ్తారు, అలాగే ఇక్కడి గొప్ప వ్యక్తి ఎవరైనా విదేశంలో మరణిస్తే, వారిని ఇక్కడకు తీసుకువస్తారు. తమ భూమి పట్ల గౌరవం ఉంటుంది. భారత్ ను భగవంతుని జన్మభూమి అని అంటారు. ఎవరినైతే భగవంతుడు లేక అల్లా, పరమాత్మ అని అంటారో, ఇప్పుడు వారి ఎదురుగా మీరు కూర్చున్నారని మీకు తెలుసు. వారికి పేరైతే తప్పకుండా ఉండాలి కదా. అల్లా అని అన్నా కూడా లింగాన్ని పూజిస్తారు. ఈశ్వరుడు లేక ఖుదా అని అంటున్నప్పుడు, తప్పకుండా వారి గుర్తులు కావాలి కదా. లింగాన్ని అన్ని చోట్ల పూజిస్తారు. ఈ రోజుల్లో చిత్రాలలో కూడా దేవతల ఎదురుగా పరమపిత పరమాత్ముని చిత్రమైన లింగాన్ని చూపిస్తారు. వారు అందరికన్నా ఉన్నతమైనవారు, వారికి తమకంటూ శరీరం లేదు, అందుకే వారిని నిరాకారుడని అంటారు. వారు సాకారుడు కాదు. మేము శిక్షణ తీసుకునేందుకు కల్ప-కల్పము వారి ముందు హాజరవుతామని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. భగవానువాచ అని అన్నప్పుడు తప్పకుండా రాజయోగాన్ని నేర్పిస్తూ ఉండవచ్చు. విద్యార్థులకు రాజయోగాన్ని నేర్పించారు, తర్వాత వారు రాజా-రాణులుగా అయ్యారు. యుద్ధం మొదలైనవాటి విషయమేమీ లేదు. ఈ లక్ష్మీనారాయణులు మొదలైనవారు రాజ్యాధికారాన్ని యుద్ధం చేసి ఏమీ పొందలేదు. వీరు సత్యయుగ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది ప్రపంచానికి అసలు తెలియదు. మేము తండ్రి నుండి రాజ్యాన్ని తీసుకుంటున్నామని, మేము వారి సమ్ముఖంగా కూర్చున్నామని పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. వారే మనకు తండ్రి, కృష్ణుడు కాదు. కృష్ణుడు చిన్న బాలుడు, అతడు రచన. ఇప్పుడు కృష్ణుడు పదవిని తీసుకుంటున్నారు, దీని ఆధారంగా భవిష్యత్తులో కృష్ణుడిగా పిలువబడతారు. ఇదంతా చదువుకు సంబంధించిన విషయము.
తండ్రి మాకు రాజయోగాన్ని నేర్పిస్తారని మీకు తెలుసు. ఎలాగైతే మనుష్యులు, మనుష్యులను బ్యారిస్టర్, ఇంజనీర్ మొదలైనవారిగా తయారుచేస్తారు. అక్కడ వారు మనుష్యులే కదా. మనం కూడా మనుష్యులమే కానీ మనం పతితులుగా ఉన్నామని మీకు తెలుసు. ఇప్పుడు తండ్రి పావనంగా కూడా తయారుచేస్తారు మరియు మనకు వారసత్వాన్ని కూడా ఇస్తారు. కొత్త ప్రపంచమే పావన ప్రపంచంగా ఉంటుంది. కొత్త ప్రపంచంలోనే రాజ్యముంటుంది. ఇప్పుడు మీరు తండ్రి సమ్ముఖంగా కూర్చున్నారు. ఎలాగైతే లౌకిక తండ్రి కూర్చుని పిల్లలకు ప్రేమగా అర్థం చేయిస్తారో, అలా వీరు విచిత్రుడైన పారలౌకిక తండ్రి. వీరి కోసమే త్వమేవ మాతాశ్చ, పితా త్వమేవ….. అని మీరు పాడుతూ వచ్చారు. ఎవరినైతే మనం భక్తి మార్గంలో మహిమ చేసామో, వారు తమ పాత్రను అభినయిస్తున్నారని ఈ సమయంలో మీకు తెలుసు. మేము శివబాబా వద్దకు వచ్చామని మీరంటారు. ఉత్తరాన్ని కూడా – శివబాబా, కేర్ ఆఫ్ బ్రహ్మా అని రాస్తారు. మీరు ఎవరికైనా పోస్టును చూపించినట్లయితే ఆశ్చర్యపోతారు – శివబాబా, కేర్ ఆఫ్ బ్రహ్మా, అని ఎప్పుడూ వినలేదని అంటారు. శివబాబా బ్రహ్మాలోకి వచ్చి విష్ణుపురిని స్థాపన చేస్తున్నారు, వారు ఎదురుగా నిలబడి ఉన్నారు. పైన శివబాబా ఉన్నారు. శివబాబా బ్రహ్మా ద్వారా స్థాపన చేసారు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. ఇది ప్రవృత్తి మార్గము. రాజవిద్యలో కూడా బారిస్టర్ చదివించేటప్పుడు, స్త్రీ-పురుషులు ఇరువురూ చదువుకుంటారు. స్త్రీలు కూడా జడ్జి, బ్యారిస్టర్, డాక్టర్ మొదలైనవారిగా అవుతారు. ఇది కూడా ప్రవృత్తి మార్గమే. సన్యాసులది నివృత్తి మార్గము, అది వేరు. ఒకవేళ శంకరాచార్యుడు రాకపోయి ఉంటే, పవిత్రత యొక్క అంశం మిగిలేది కాదని, భారత్ పూర్తిగా కాలిపోయుండేదని కూడా బాబా అర్థం చేయించారు. భారత్ ను నిలబెట్టేందుకు ఈ విధంగా నిశ్చయించబడింది. భారత్ చాలా పవిత్రంగా ఉండేది, తర్వాత అపవిత్రంగా అయింది. ఇప్పుడు భారత్ ఎంత నిరుపేదగా ఉంది. బంగారు లంక సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయిందని అంటారు. ఇప్పుడు లంక అయితే బంగారంతో తయారుచేయబడి ఉండదు. ఈ కథలన్నీ కూర్చుని రాసారు, వీటి వల్ల లాభమేమీ లేదు.
తప్పకుండా తండ్రి మనల్ని పూర్తి సహజమైన స్మృతి యొక్క బలంతో ఎంత ఉన్నతంగా తయారుచేస్తారు అనేది పిల్లలైన మీకు తెలుసు. బాబా ప్రతిజ్ఞ చేస్తారు – ఒకవేళ నిరంతరం స్మృతి చేసే పురుషార్థాన్ని చేసినట్లయితే, వికర్మలు వినాశనమైపోతాయి. భక్తి మార్గంలో కూడా స్మృతి చేసే పురుషార్థం చేసారు కదా. ఎందుకు స్మృతి చేస్తారు? మాకు సాక్షాత్కారం కలగాలి అని స్మృతి చేస్తారు. అంతేకానీ, కృష్ణపురిలో మాకు రాజ్యాధికారం లభించాలని లేక మేము నరుని నుండి నారాయణునిగా అవ్వాలి అనేమీ స్మృతి చేయరు. మేము మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి – అనే ఆశ మీకు కూడా ఉండేది కాదు. మనుష్యుల నుండి దేవతలుగా చేయడానికి ఎంతో సమయం పట్టదు….. అని పాడుతారు కూడా. తప్పకుండా కలియుగం తర్వాత సత్యయుగం వస్తుందని మీరు చూస్తారు. కలియుగంలో ఎంతమంది మనుష్యులున్నారు! సత్యయుగంలో ఒకే ధర్మముంటుంది. ఇప్పుడు మీకు ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానం కూడా లభించింది. ఆత్మ జ్ఞానం ఉన్న మనుష్యులు ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. ఆత్మలో 84 జన్మల పాత్ర ఎలా నిశ్చయించబడి ఉంది అనేది ఎవరికీ తెలియదు. ఈ మాటలు కూడా ఎప్పుడూ ఎవరి నుండి వినలేదు. తండ్రి జ్ఞాన సాగరుడు, పతితపావనుడు, నిరాకారుడు. మన ఆత్మ ఇప్పుడు పాపాత్మ నుండి పుణ్యాత్మగా అవుతుందని మీకు తెలుసు. సత్యయుగంలోనైతే అందరూ పుణ్యాత్ములే. ఇక్కడ పాపాత్ములు ఉన్నారు. చాలా దాన-పుణ్యాలు చేసినవారిని పుణ్యాత్ములని అంటారని కాదు. పుణ్యాత్ములు సత్యయుగంలో ఉంటారు. ఇక్కడ మనుష్యుల్లో ఎవరైతే దానపుణ్యాలు చేస్తారో, వారిని పుణ్యాత్ములుగా భావిస్తారు. అక్కడ మీకు దాన-పుణ్యాలు మొదలైనవి చేయాల్సిన అవసరముండదు. అక్కడ అసలెవరూ పేదవారిగా ఉండరు. అక్కడ మీరు సదా పుణ్యాత్ములుగానే ఉంటారు. మీరు మీ తనువు, మనసు ధనం అంతా అనంతమైన తండ్రి పేరు మీద ఇస్తారు. దీనినే బలిహారమవ్వడమని అంటారు. తండ్రి అంటారు – నేను ముందు బలిహారమవుతానా లేక మీరా? బాబా అంటారు – ముందు మీరు బలిహారమవుతారు, అప్పుడు 21 జన్మల కోసం బలిహారం లభిస్తుంది. ఈ విషయాలను ఇప్పుడు మీరు మంచి రీతిగా అర్థం చేసుకుంటారు, డైరెక్టుగా వింటారు. ఇంట్లో ఉన్నా కూడా అక్కడకి మురళీ అందుతుంది, అంటే దూరం నుండి వింటారు. ఇప్పుడైతే తండ్రి సమ్ముఖంగా కూర్చున్నారు. తండ్రి అంటారు – పిల్లలూ, నేను మీకు తండ్రిని కూడా. ఇక్కడ అంధ శ్రద్ధ యొక్క విషయమేమీ లేదు. బాబా తండ్రి కూడా, టీచరు కూడా. తండ్రికి చెందినవారిగా అవ్వడంతో వారు శిక్షణనిస్తారు, మీ బుద్ధిలో ఇప్పుడు జ్ఞానమంతా ఉంది. 84 జన్మల చక్రం కూడా మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఎవరైతే 84 జన్మలు తీసుకునేవారిగా ఉండరో, వారు అర్థం చేసుకోరు. తప్పకుండా మేము 84 జన్మల చక్రం తిరిగి, ఇప్పుడు తిరిగి వెళ్తామని మీరు అర్థం చేసుకుంటారు. ఆత్మలైన మీరు అశరీరులుగా వచ్చారని, మళ్ళీ అశరీరులుగా అయ్యి తిరిగి వెళ్ళాలని తండ్రి అంటారు. మీరు పవిత్రాత్మలుగా అయి వెళ్తారు. పవిత్రంగా అవ్వడం కోసం మీరు పురుషార్థం చేస్తున్నారు. యోగబలంతో అనగా స్మృతిబలంతో మీరు పవిత్రంగా అయిపోతారు. యోగమనే పదం శాస్త్రాలకు సంబంధించినది. రైట్ పదం స్మృతి. పత్నికి పతి యొక్క స్మృతి మరియు పతికి పత్ని యొక్క స్మృతి ఉంటుంది కదా. యోగం యొక్క అర్థమే స్మృతి. బాబా కూడా – నన్నొక్కడినే స్మృతి చేయండి, ఇతర సాంగత్యాల నుండి బుద్ధి యోగాన్ని తెంచి, తండ్రినైన నాతో బుద్ధి యోగాన్ని జోడించండి, స్మృతి చేయండి అని అంటారు. ఎంతగా స్మృతి చేస్తారో, అంతగా మీ వికర్మలు వినాశనమవుతాయి. తప్పకుండా భారత్ కు కల్ప-కల్పము వారసత్వం లభిస్తుంది. శివజయంతి కూడా ప్రసిద్ధమైనది. ఎలాగైతే బుద్ధుడు, క్రీస్తు మొదలైనవారికి జయంతులు ఉంటాయో, అలాగే నిరాకార శివునికి కూడా జయంతి ఉంటుంది. వారు ఉన్నతాతి ఉన్నతమైనవారు. కృష్ణ జయంతి కూడా ప్రసిద్ధమైనది. కానీ వారు వచ్చి ఏమి చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. కృష్ణుడు సత్యయుగ రాకుమారుడిగా ఉండేవారు. సత్యయుగ రాకుమారునిగా అవ్వడం కోసం, వారికి తప్పకుండా ఎవరో అలాంటి కర్మను నేర్పించి ఉంటారు. చిన్న పిల్లలు ఎలాగూ పవిత్రంగానే ఉంటారు. అక్కడ వికారాల విషయం ఉండదు. పిల్లలు శుద్ధంగా ఉంటారు. భగవంతుడు ఒక్కరే, వారే నిరాకారుడు, గాడ్ ఈజ్ వన్. మిగిలినవారంతా రచన. రచన నుండి ఎప్పుడూ రచనకు వారసత్వం లభించదు. వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. సోదరుడికి సోదరుడి నుండి వారసత్వం లభించదు. మీరంతా పరస్పరంలో సోదరులు. బ్రదర్ హుడ్ (సహోదర భావం) అని అంటారు కదా. తండ్రి అయితే ఒక్కరే. వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. సోదరులందరి సద్గతి దాత తండ్రి ఒక్కరే. ఆత్మలందరికీ తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. తండ్రి అంటారు – నేను వచ్చి ఆత్మలను చదివిస్తాను, ఆత్మలకు సద్గతినిస్తాను. తండ్రి కూర్చుని రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ చదువుకు సంబంధించిన పదవిని మీరు ఇక్కడ పొందరు. వారు బ్యారిస్టర్ మొదలైనవారిగా ఈ జన్మలోనే అవుతారు, తర్వాత ఇంకొక జన్మ తీసుకుని మళ్ళీ చదువుతారు.
ఈ చదువుతో మనము 21 జన్మలకు ప్రారబ్ధాన్ని పొందుతామని మీకు తెలుసు. అక్కడ సత్యయుగంలో డాక్టర్ మొదలైనవారు ఎవరూ ఉండరు. అక్కడ అనారోగ్యాలే ఉండవు. అక్కడ మీరు గర్భ మహలులో ఉంటారు. ఇక్కడ గర్భ జైలులో ఉంటారు, ఇందులో చాలా శిక్షలు అనుభవిస్తారు. అప్పుడు, ఈ జైలు నుండి బయటకు తీయండి, మేము ఇక మళ్ళీ ఏ తప్పు చేయము అని పిలుస్తారు. ధర్మరాజుకు ప్రతిజ్ఞ చేస్తారు. ఇక్కడ మీరు శివబాబాకు ప్రతిజ్ఞ చేయాలి – బాబా, మేమెప్పుడూ వికర్మలు చేయము, మేము పంచ వికారాలను మీకు ఇచ్చేస్తాము. వికారాలనేవి వెంటనే ఏమీ వదిలిపోవని కూడా బాబాకు తెలుసు. మేము వికారాలను దానమిచ్చి మళ్ళీ తీసుకుంటే చాలా పాపం తయారవుతుందని లోపల భయం ఉండాలి. రాజా హరిశ్చంద్రుని ఉదాహరణ ఉంది కదా. 5 వికారాలనేవి వెంటనే వదిలిపోవని బాబాకు తెలుసు. దానికి సమయం పడుతుంది. మీ కర్మాతీత అవస్థ తయారైనప్పుడు యుద్ధం మొదలవుతుంది. ఈ పంచ వికారాలు పెద్ద శత్రువులు. వాటిలో కూడా ఒకటి ముఖ్యమైనది – దేహాభిమానము. దానిని దానం చేయడం ఎంత కష్టము. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, తండ్రినైన నన్ను స్మృతి చేయండి అని బాబా పదే-పదే చెప్తారు. కానీ అలా జరగటం లేదు. దేహాభిమానులుగా అవ్వడంతో కామం యొక్క దెబ్బ తగులుతుంది. దేహాభిమానం అన్నింటికంటే తీక్షణమైనది. దేహీ-అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. ముఖ్యంగా దేహాభిమానం రావడంతోనే పాపాలు జరిగాయి. పంచ వికారాలను దానంగా ఇవ్వాల్సి ఉంటుంది, ఇందులో సమయం పడుతుంది. ప్రియుడు లేకుండా ప్రేయసులు వెళ్ళలేరు. ముందు ప్రియుడు వెళ్ళాలి, తర్వాత ప్రేయసులు. ప్రియుడు వచ్చి ఆత్మలందరినీ తీసుకువెళ్ళాలి. కర్మాతీత అవస్థ తయారయ్యేంత వరకు పురుషార్థం చేయాలి. దేహాభిమానం రావడంతోనే పొరపాట్లు జరుగుతాయి. బాబా, దేహాభిమానంలోకి వచ్చి వికారాలలో పడిపోయామని అంటారు. తుఫాన్లు అయితే చాలా వస్తాయి. వికారాల సంకల్పాలు వచ్చినా కానీ, కర్మేంద్రియాలతో ఎప్పుడూ ఎటువంటి పాపం చేయకూడదు. మాయను జయించేందుకు ఎంత శ్రమించవలసి ఉంటుంది. బాబా అంటారు – ఒకవేళ వివాహితులైతే, పవిత్రంగా ఉండి చూపించండి, అప్పుడు సన్యాసులు కూడా చూస్తారు. మీది ఎంత భారీ సంపాదనో చూడండి. పవిత్రంగా ఉండి చూపించినట్లయితే చాలా ఉన్నతమైన పదవిని పొందుతారు. మీపై అందరూ బలిహారమవుతారు, బాబా కూడా మహిమ చేస్తారు. పవిత్రంగా కూడా ఉండాలి, కానీ యోగం కూడా కావాలి. యోగంలోనే పదే-పదే విఘ్నాలు కలుగుతాయి. దేహాభిమానం వచ్చేస్తుంది. పవిత్రంగా ఉంటారు, అది సరే, పవిత్రతతోనే పవిత్ర ప్రపంచంలో వారసత్వాన్ని పొందుతారు. కానీ మాయ కూడా మళ్ళీ జోరును చూపిస్తుంది, మాయ చాలా దాడి చేస్తుంది. ఇదంతా జరుగుతుందని తండ్రి అర్థం చేయిస్తారు. పిల్లలు ధైర్యాన్ని చూపిస్తారు కానీ దానితో పాటు నిరంతర స్మృతి కూడా ఉండాలి, అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి. ఎవరైతే రుస్తుమ్ గా అవుతారో, వారిని మాయ కూడా చాలా సతాయిస్తుంది. స్మృతిలో కష్టం మీద ఉండగలరు. ఎవరైతే ఉండగలుగుతున్నారో, వారిని అనుభవం అడగాలి. వారు ఏమి అనుకుంటున్నారు, ఎలా ఉండగలుగుతున్నారు అని అడగాలి. స్మృతిలో ఉండడంతో వికర్మలు వినాశనమవుతాయి. ఈ విషయము పూర్తిగా అతీతమైనది, కొత్తది. ఇక్కడ కూర్చున్నప్పుడు నషా ఎక్కి ఉంటుంది. భగవంతుడు నిరాకారుడు ఒక్కరే, కృష్ణుడు కాదు అని కూడా అర్థం చేసుకుంటారు. వాస్తవానికి కృష్ణుని కోసం, రోలుకు బంధించారు, ఇది చేసారు….. అని శాస్త్రాలలో రాసేసారు. అలాంటివేమీ జరగలేదు. ఇది కూడా వారిని నిందించడము, అవమానించడము వంటిది. కృష్ణునిలో ఎలాంటి అవగుణాలు ఉండేవి కాదు. అల్లరి చేయడము కూడా ఒక అవగుణము కదా. కృష్ణుడు పూర్తి మర్యాదా పురుషోత్తముడు. సర్వ గుణ సంపన్నుడు….. అని వారి మహిమను పాడుతారు. గురు బ్రహ్మా, గురు విష్ణు….. అని అంటూ ఉంటారు. మాకు గురువులు లేరు, మేము ఇతడిని గురువుగా లేక ఈశ్వరునిగా భావించము అని చెప్పండి. పతితపావనుడైతే ఒక్క నిరాకారుడే కదా. సాకార గురువులెవ్వరూ పతితపావనులు కాలేరు. ఈ సమయంలో మీరు పరమపిత పరమాత్ముని పూర్తి జీవితకథను తెలుసుకున్నారు. 5 వేల సంవత్సరాలలో శివబాబా ఎటువంటి పాత్రను అభినయిస్తారు అనేది మీరు తండ్రి ద్వారా తెలుసుకున్నారు. నాలెడ్జ్ ఫుల్ అయితే తండ్రియే కదా. సుఖం-శాంతి-ఆనంద సాగరుడు….. అనే ఈ మహిమ వారిదే. తండ్రి వద్ద ఖజానా ఉంటే, దానిని తప్పకుండా పిల్లలకు కూడా ఇస్తూ ఉంటారు కదా. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. కర్మాతీత అవస్థను ప్రాప్తి చేసుకునేందుకు, ఈ కర్మేంద్రియాలతో ఎటువంటి పొరపాటు చేయకూడదు. పవిత్రంగా ఉండడంతో పాటు స్మృతిలో కూడా దృఢంగా ఉండాలి.
2. సదా పుణ్యాత్మగా అయ్యేందుకు, తనువు-మనసు-ధనములతో తండ్రిపై బలిహారమవ్వాలి. ఒక్కసారి బలిహారమైనట్లయితే, 21 జన్మలకు పుణ్యాత్మగా అయిపోతారు.
వరదానము:-
సర్కస్ లో కళలు చూపించే కళాకారుల ప్రతి కర్మ ఒక కళలా ఉంటుంది. ఆ కళాకారులు శరీరంలోని ఏ అంగాన్ని అయినా ఎలా కావాలనుకుంటే అలా, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం మలచగలరు, ఇదే వారి కళ. పిల్లలైన మీరు బుద్ధిని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం, ఎక్కడ స్థితి చేయాలనుకుంటే అక్కడ స్థితి చేయండి – ఇదే అన్నింటి కంటే పెద్ద కళ. ఈ ఒక్క కళతో 16 కళల సంపన్నులుగా అయిపోతారు. దీని కోసం ఆర్డర్ అనుసారంగా, ఒక్క సెకండులో అశరీరులుగా అయ్యేంత ఉపరామంగా మరియు ఎవర్రెడీగా అవ్వండి. యుద్ధంలో సమయం పోకూడదు.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!