21 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

21 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

20 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - మీరు మీ యోగబలంతో ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి కొత్తదిగా చేస్తారు, మీరు ఆత్మిక సేవ కోసమే ప్రత్యక్షమయ్యారు”

ప్రశ్న: -

నిజాయితీపరులైన, సత్యమైన పురుషార్థీ పిల్లల గుర్తులేమిటి?

జవాబు:-

నిజాయితీపరులైన పిల్లలు ఎప్పుడూ తమ పొరపాటును దాచిపెట్టరు, వెంటనే బాబాకు వినిపిస్తారు. వారు చాలా-చాలా నిరహంకారులుగా ఉంటారు. వారి బుద్ధిలో సదా ఈ ఆలోచనే ఉంటుంది – నేను ఎలాంటి కర్మలను చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు 2. వారు ఎవరి డిస్సర్వీసును వర్ణించరు. తమ సర్వీస్ లోనే నిమగ్నమై ఉంటారు. వారు ఎవరి అవగుణాలను చూస్తూ తమ తలను పాడు చేసుకోరు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

ఓర్పు వహించు మానవా….. (ధీరజ్ ధర్ మనువా…..)

ఓంశాంతి. మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఓర్పునిస్తున్నారు. లౌకిక తండ్రి కూడా ఓర్పును అందిస్తారు కదా! ఎవరైనా అనారోగ్యంపాలైతే వారికి ధైర్యాన్నిస్తారు – అనారోగ్యంతో ఉన్న మీ దుఃఖపు రోజులు మారి సుఖపు రోజులు వస్తాయి. హద్దు తండ్రి హద్దు ఓర్పునిస్తారు. ఇప్పుడు వీరైతే అనంతమైన తండ్రి. పిల్లలకు అనంతమైన ఓర్పునిస్తున్నారు. పిల్లలూ, ఇప్పుడు మీ సుఖం యొక్క రోజులు వస్తున్నాయి. ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉంటూ ఇతరులకు కూడా నేర్పించండి. మీరు కూడా శివశక్తులు కదా! శివబాబా యొక్క శక్తి సైన్యం మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. వీరు (గోపులు) కూడా ఆత్మలే. వీరందరూ శివుని నుండి శక్తిని తీసుకుంటారు. మీరు కూడా శక్తిని తీసుకుంటారు. ఇందులో కృప లేక ఆశీర్వాదాల విషయమేమీ లేదని తండ్రి అర్థం చేయించారు. స్మృతిలో ఉంటూ శక్తిని తీసుకుంటూ ఉండండి. స్మృతితోనే మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు శక్తివంతులుగా అవుతూ ఉంటారు. శివుని శక్తి సైన్యం ఎంతటి సర్వశక్తివంతమైనదంటే, అది పాత ప్రపంచాన్ని మార్చి కొత్తదిగా తయారుచేసింది. మనం యోగబలంతో ఈ పాత ప్రపంచాన్ని మారుస్తామని మీకు తెలుసు. అల్లాను, గాడ్ ను స్మృతి చేయండి అని మనుష్యులు చేతి వేలితో ఇలా పైకి సూచిస్తారు. తండ్రి స్మృతితో ఈ రాళ్ళ పర్వతం అనగా ఈ ప్రపంచం మారుతుందని పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం పరిస్తాన్ ను స్థాపన చేస్తున్నాము. ప్రదర్శినీలో బాగా సేవ చేయండి, శ్రమించండి, సమయం లభించినప్పుడల్లా కూర్చొని నేర్చుకోండి అని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇదా చాలా సహజము. పిల్లలకు అన్ని రకాల శిక్షణలు లభిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి కర్మల లెక్క ఉంటుంది. కన్యల కర్మలు బాగున్నాయి. వివాహమైనవారు ఏమంటారంటే – ఈ సమయంలో ఒకవేళ నేను కన్యగా ఉండి ఉంటే, ఈ బంధనాలన్నింటి నుండి విముక్తులై ఫ్రీ బర్డ్ గా ఉండేదానిని. కన్యలు ఫ్రీ బర్డ్స్. కానీ చెడు సాంగత్యంతో నష్టం కలుగుతుంది. పత్నికి పతి, పిల్లలు మొదలైనవారి సంకెళ్ళు ఎన్ని ఉంటాయి. ఇందులో ఆచార-పద్ధతులు మొదలైన బంధనాలు ఎన్ని ఉంటాయి. కన్యలకు ఎటువంటి బంధనాలు లేవు. ఇప్పుడు బొంబాయిలో కూడా కన్యలు తయారవుతున్నారు. మా ప్రాంతాన్ని మాకు మేమే సంభాళించుకుంటాము అని అంటారు. అందరూ తమ తమ ప్రాంతాల కొరకు ఎంత శ్రమిస్తారు. మా గుజరాత్, మా యు.పి….. అని అంటారు. ఇప్పుడు మీరు మీ స్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు. ఇందులో నేను ఫలానా, ఫలానా ప్రాంతానికి చెందినవాడిని అనేది కూడా ఉండకూడదు. మీరు ఎవరి పట్ల ఈర్ష్య పెట్టుకోకూడదు. ఎవరి అవగుణాలను చూస్తూ తల పాడు చేసుకోకూడదు. నేను ఎంతమంది ఆత్మలకు అనగా ఎంతమంది సోదరీ-సోదరులకు సుఖం యొక్క మార్గాన్ని తెలియజేసాను అని స్వయాన్ని చూసుకోవాలి. ఒకవేళ మార్గం తెలియజేయలేదంటే, వారు దేనికి పనికి రారు. హృదయాన్ని అధిరోహించలేరు. బాప్ దాదా హృదయాన్ని అధిరోహించలేదు అంటే సింహాసనంపై కూర్చోలేరు. కొంతమంది పిల్లలకు సేవ పట్ల చాలా అభిరుచి ఉందని, దేహాభిమానం ఏ మాత్రం లేదని బాబాకు తెలుసు. మరి కొంతమంది అయితే చాలా అహంకారంలో ఉంటారు. వారు తమపై తాము కాకుండా బాబాపై కృప చూపిస్తున్నామని అనుకుంటారు. ఎప్పుడూ ఎవరి అవగుణాలను చూడకూడదు. ఫలానావారు ఇలా ఉన్నారు, ఇది చేస్తారు అని అనుకోకూడదు. ఈ రోజుల్లో ఇతరుల డిస్సర్వీసును వర్ణించే తెలివైనవారు కూడా ఉన్నారు. ఫలానావారు ఇది చేస్తారు, ఇలా ఉన్నారు అని అంటారు. అరే! మీరు మీ సర్వీసు చేసుకోండి. బ్రాహ్మణ పిల్లల పని – సర్వీసులో నిమగ్నమవ్వడము. తండ్రి కూర్చొని ఉన్నారు, తండ్రి వద్దకు సమాచారమంతా వస్తుంది. ప్రతి ఒక్కరి అవస్థను గురించి తండ్రికి తెలుసు. సర్వీసును చూసి మహిమ కూడా చేస్తారు. పిల్లల్లో సర్వీసు పట్ల ఉత్సాహం కలగాలి. ప్రతి ఒక్కరు ఈ ఆత్మిక సర్వీసు ద్వారా తమ కళ్యాణం చేసుకోవాలి. ఆ వ్యాపారాలు మొదలైనవైతే జన్మజన్మలుగా చేస్తూ వచ్చారు. ఈ వ్యాపారాన్ని చేసే వ్యాపరస్థులు ఎవరో అరుదుగా ఉంటారు. బాబా సేవ కోసం చాలా సహజమైన విధానాలను అర్థం చేయిస్తారు. ఎప్పుడూ ఇతరులను నిందించకండి. ఇలా చాలా మంది చేస్తూ ఉంటారు. మంచి-మంచి మహారథులకు కూడా మాయ ముక్కు పట్టుకుంటుంది. తండ్రిని స్మృతి చేయకపోతే మాయ పట్టుకుంటుంది. తండ్రి కూడా అంటారు కదా – నేను సాధారణ తనువులోకి రావడం చూసి నన్ను గుర్తించలేకపోతారు. ఇలా ఇలా చేయాలి – అని బాబాకు కూడా సలహాలనిస్తారు. వారి అవస్థ ఎలా ఉంటుందంటే, బాబా కొద్దిగా ఏమైనా చేసినా, వారు ద్రోహులుగా అయిపోతారు. బాబాకు కూడా తమ మతాన్ని పంపిస్తారు. ఎలుకకు పసుపు కొమ్ము దొరకగానే తానొక పెద్ద వ్యాపారి అయిపోయానని అనుకుంటుందనే సామెత ఉంది కదా. మేము డిస్సర్వీసు చేస్తున్నాము – అని అర్థం చేసుకోరు. పొరపాట్లు అయితే చాలా మంది ద్వారా జరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అవస్థ ఉన్నతంగా ఉంటుంది, అప్పుడప్పుడు తక్కువగా ఉంటుంది, ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు తమ అవస్థను చూసుకోవాలి. నిజాయితీపరులైన పిల్లలు తమ అవస్థ గురించి వెంటనే తెలియజేస్తారు. కొందరు తమ పొరపాట్లను దాచి పెడతారు. ఇందులో చాలా నిరహంకారితనం కావాలి. సేవను వృద్ధి చేయడంలో నిమగ్నమైపోవాలి. సదా ఈ ఆలోచన ఉండాలి – నేను ఎలాంటి కర్మలను చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. నేను ఎవరినైనా నిందిస్తే, ఇతరులు కూడా అలా చేయడం మొదలుపెడతారు. చాలా మందికి ఈ ఆలోచన రాదు. తండ్రి అర్థం చేయిస్తారు – మీరు మీ సర్వీసులో నిమగ్నమవ్వండి లేదంటే చాలా పశ్చాత్తాపపడతారు. చాలామంది శత్రువులుగా కూడా అవుతారు.

ఇప్పుడు మీరు శూద్రుల నుండి ట్రాన్స్ఫర్ అయ్యి బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు. ఎవరిలోనైతే 5 వికారాలు ఉంటాయో, వారు ఆసురీ సంప్రదాయానికి చెందినవారు. మీరు దైవీ సంప్రదాయానికి చెందినవారు. మీరు దేవతలుగా అయ్యేందుకు వికారాలపై విజయం పొందుతున్నారు. దేవతలైతే ఇక్కడ లేరు. దేవతలు సత్యయుగంలో ఉంటారు. ఇప్పుడు మీరు దైవీ సంప్రదాయానికి చెందినవారిగా అవుతున్నారు.

పిల్లలైన మీకిప్పుడు అర్థం చేయించడానికి అవకాశం లభిస్తుంది. ప్రదర్శినీలో అర్థం చేయిస్తూ ఉండండి. ప్రదర్శినీలలో, మేళాలలో ప్రతి ఒక్కరి నాడి గురించి తెలుస్తుంది. ప్రొజెక్టర్ ద్వారా ఎవరికీ అర్థం చేయించలేరు. సమ్ముఖంగా అర్థం చేయించినప్పుడే అర్థం చేసుకోగలరు. ప్రదర్శినీలు, మేళాలు చాలా మంచివి. అందులో మీరు వ్రాయవచ్చు కూడా. ప్రదర్శినీలు, మేళాల పట్ల అభిరుచి ఉండాలి. రెగ్యులర్ గా చదువుకోవడం ద్వారానే నషా ఎక్కుతుంది. బంధనంలో ఉన్నవారైతే ఇంట్లో ఉంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, అప్పుడు వికర్మలు వినాశనమైపోతాయి. ఇంట్లో కూర్చొంటూ కూడా స్మృతి చేయడం మంచిదే. కానీ స్మృతి చేయడమనేది పిల్లలకు చాలా కష్టమైన విషయం అయిపోయింది. ఏ తండ్రి నుండైతే 21 జన్మల వారసత్వం లభిస్తుందో, వారిని స్మృతి చేయరు. మంచి-మంచి భాషణలు చేసే మహారథులు కూడా తండ్రిని స్మృతి చేయరు, ఉదయం లేవలేరు. లేచినా కూర్చోగానే కునికిపాట్లు పడుతూ ఉంటారు. స్మృతి చేసేందుకు ఉదయం వేళే మంచిది. భక్తి మార్గంలో కూడా ఉదయాన్నే లేచి స్మృతిలో కూర్చుంటారు. కానీ వారిది దిగే కళ. ఇక్కడైతే ఎక్కే విషయమే. మాయ ఎన్ని విఘ్నాలు వేస్తుంది. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయకపోతే ధారణ ఎలా జరుగుతుంది, వికర్మలు వినాశనమెలా అవుతాయి. ఇకపోతే, కేవలం మురళీ నడిపించడమనేది చిన్న పిల్లలు కూడా నేర్చుకొని అర్థం చేయించడం మొదలుపెడతారు. ఈ చదువు పెద్దవారి కోసము. ఇది ఎంత పెద్ద యూనివర్సిటీ. మమ్మల్ని చదివించేవారెవరు అనే నషా పిల్లలకు ఉండదు. మాయ ఎవరినైనా మోసం చేస్తే, మనం వారిని చూడకుండా మన సర్వీసులోనే నిమగ్నమై ఉండాలి. తండ్రి వద్దకు అన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి. కొందరు దేహాభిమానంలోకి వచ్చి – వీరు ఇలా చేస్తారు, ఇది చేస్తారు అని అనుకుంటూ ఉంటారు, ఈ విధంగా ఇతరులను నిందిస్తూ టైమ్ వేస్ట్ చేసుకుంటారు. మీ పని సేవలో ఉండడము. ఏదైనా జరిగితే, తండ్రికి సూచన ఇస్తారు, అంతే చాలు. పరచింతన చేయకూడదు. పిల్లలు సేవలో రాత్రింబవళ్ళు నిమగ్నమవ్వాలి. మీ వ్యాపారమే ఇది. వీరు శివబాబా, వీరు ప్రజాపిత బ్రహ్మా అని రోజు ప్రదర్శినీలో అర్థం చేయించండి. కల్పక్రితం కూడా ప్రజాపిత బ్రహ్మా మహిమ చేయబడ్డారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. అలాగని ఇంతకుముందు అసలు మనుష్యులు లేనే లేరని కాదు. మనుష్య సృష్టిని రచిస్తారు అనగా ముళ్ళను పుష్పాలుగా తయారుచేస్తారు. బ్రహ్మా ద్వారా సృష్టిని రచిస్తారు అంటే సృష్టిని పైన రచిస్తారని కాదు! బ్రహ్మా అయితే ఇక్కడ ఉంటారు కదా! ఎంత స్పష్టంగా అర్థం చేయించడం జరుగుతుంది.

తండ్రి అంటారు – నేను వీరి అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించి మనుష్యులను దేవతలుగా చేస్తాను. కనుక పిల్లలు సర్వీసులో రాత్రింబవళ్ళు శ్రమించాలి. వ్యాపారాలు మొదలైనవాటి నుండి కొంత సమయాన్ని తీసి ఇందులో నిమగ్నమవ్వాలి. తీరిక లభించడం లేదని అనకూడదు. అనారోగ్యం వస్తే అప్పుడు తీరిక లేదని అంటారా? పురుషార్థం చేయాలి. ప్రేరణతో ఏమీ జరగదు. భగవంతుడే ప్రేరణ ద్వారా పని చేయలేరు అన్నప్పుడు ఇక ఇతరుల ఎలా చేయగలుగుతారు. భగవంతుడు చేయలేనిది ఏముంది, వారు చనిపోయినవారిని బ్రతికించగలరని అనుకుంటారు. అరే! భగవంతుడిని మీరు – ఓ పతితపావనా! మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయండి అని పిలుస్తారు. అంతే, మీరు ఇంకేమీ అనరు. మీరు వచ్చి చనిపోయిన వారిని బ్రతికించండి అని పిలవరు. వారు పతితపావనుడు. భారత్ పావనంగా ఉండేది కదా! తండ్రి అంటారు – నేను కల్ప-కల్పము వచ్చి పావనంగా చేస్తాను. మాయ వచ్చి మళ్ళీ పతితంగా చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను పావనంగా చేయడానికి వచ్చాను. ఎంత సహజమైన విషయాన్ని తెలియజేస్తారు. హకీమ్ లు (మూలిక వైద్యులు) పెద్ద అనారోగ్యాలను కూడా వేర్లు, మూలికలతో నయం చేస్తారు కావున వారికి మహిమ జరుగుతుంది. ఎవరికైనా కొడుకు పుడితే లేక ధనం లభిస్తే, గురు కృప లభించిందని అంటారు. అచ్ఛా, కొడుకు మరణిస్తే, తలరాత అని అంటారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. సన్యాసులు పవిత్రంగా అవుతారు కనుక వారికి గౌరవముంటుంది. కానీ వారు హఠయోగులు, వారు రాజయోగాన్ని నేర్పించలేరు. వారు సన్యాసులు, మనం గృహస్థులము. మరి మనం మనల్ని ఫాలోవర్స్ (అనుచరులు) అని ఎలా చెప్పుకోగలము. తండ్రి అంటారు – పిల్లలు పూర్తిగా ఫాలో చేయాలి – మన్మనాభవ – నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు మరియు నాతో పాటు వస్తారు. నేను సదా పావనుడను. మనుష్యులు పతితంగా చేస్తారు, తండ్రి వచ్చి పావనంగా చేస్తారు. వారు పవిత్రత, సుఖ-శాంతుల సాగరుడు. మిమ్మల్ని కూడా ఇలా తయారుచేస్తున్నారు. మీరు యోగబలంతో ఆత్మను పవిత్రంగా చేసుకుంటారు. మనకు ఫస్ట్ క్లాస్ శరీరం లభిస్తుందని మీకు తెలుసు. మనుష్యులను దేవతలుగా ప్రాక్టికల్ గా తయారు చేయాలి. కేవలం దేవతల వస్త్రాలు ధరించడం కాదు, స్వయం పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. దేహాభిమానం రాకూడదు. బాబా, మేము మీ నుండి వారసత్వం తీసుకునే తీరుతాము. మేము భారత్ ను శ్రేష్ఠాచారిగా చేసే తీరుతామని మీరు కూడా అంటారు. నిశ్చయం ఉన్నవారే ఇలా అంటారు కదా. కొందరు, ఇంత తక్కువ సమయంలో ఎలా జరుగుతుందని అంటారు. నిజానికి ఎప్పడూ ఇటువంటి సంశయాన్ని రానివ్వకూడదు. సంశయంలోకి రావడం వలన సేవలో ఢీలా పడిపోతారు. సమయం చాలా తక్కువ ఉంది. ఎంత వీలైతే అంత, బాగా పురుషార్థం చేయాలి. ఎక్కడైనా కాస్త యుద్ధం మొదలైన హంగామాలు జరిగితే, ఎంతగా శ్రమించడం మొదలుపెడతారో చూడండి! మేము స్మృతిలో పూర్తిగా ఉండకపోతే, ఆ సమయంలో పెనుగులాడలేమని అర్థం చేసుకుంటారు కదా. ఆ సమయంలో చాలా ఆపదలు మొదలైనవి ఉంటాయి. అందుకే, ఎంత వీలైతే అంత గ్యాలప్ చేసుకుంటూ వెళ్ళండి అని తండ్రి అంటారు. ఇది ఆత్మల రేసు. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. లక్ష్యం వరకు వెళ్ళి అనగా తండ్రి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి తిరిగి రావాలి. ఇది చాలా సూక్ష్మమైన రేస్. నన్ను టచ్ చేసి అనగా మూలవతనంలోకి వెళ్ళి మళ్ళీ రావాలి అని తండ్రి అంటారు. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో, వారే మొట్టమొదట వస్తారు. మేము ముక్తిధామానికి వెళ్ళాలని కోరుకుంటారు. కనుక తండ్రి అంటారు – నన్ను స్మృతి చేసినట్లయితే వెళ్ళగలరు. ముక్తిధామమైతే అందరికీ ఇష్టమే. తర్వాత పాత్రను అభినయించేందుకు వస్తారు. మోక్షమనేది ఎవరికీ లభించదు. ఈశ్వరీయ చరిత్ర, భూగోళాలలో మోక్షమనే పదమే లేదు. ఒక్క సెకండులో మీకు జీవన్ముక్తి లభిస్తుంది. మిగిలినవారంతా ముక్తులైపోతారు. రావణ రాజ్యం నుండి ముక్తులవ్వాల్సిందే. ఎవరైతే పురుషార్థం చేస్తారో, వారే ఉన్నత పదవిని పొందుతారు. పిల్లలు చాలా మధురంగా అవ్వాలి. చాలా మధురమైన స్వభావం ఉండాలి. క్రోధులుగా అవ్వకూడదు. దుర్వాసుని పేరు ఉంది కదా! ఈ రాజఋషులలో కూడా కొందరు ఇలాంటివారున్నారు. నేను ఏమి చేస్తున్నాను, దీనితో నాకు ఏమి పదవి లభిస్తుంది అని ఎల్లప్పుడూ తమ హృదయంపై చేయి వేసుకొని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ సేవ చేయలేదంటే, తమ సమానంగా తయారుచేయలేదంటే ఇక ఏమి పదవి లభిస్తుంది! కొద్ది మాత్రానికే రాజీ పడకూడదు. తండ్రి అంటారు – పిల్లలకు పూర్తి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. కనుక ధైర్యముంచి చూపించాలి. కేవలం చెప్పడంతో జరగదు కదా. తండ్రి సేవలో ఎముకలను సైతం ఇవ్వాలి. అలా చేస్తారు కూడా, మళ్ళీ ఎక్కడైనా దేహాభిమానం వచ్చిందంటే నషా వచ్చేస్తుంది, ఇక పడిపోతారు. మాయ కూడా తక్కువ పహల్వాన్ (వస్తాదు) ఏమీ కాదు. తండ్రి శ్రీమతమనుసారంగా నడుచుకోకపోతే మాయ దాడి చేస్తుంది. అప్పుడు తండ్రికి విడాకులిచ్చేస్తారు. తండ్రి సుఖధామానికి యజమానులుగా చేస్తారు కనుక మీపై మీకు దయ కలగాలి. తండ్రి చాలా సింపుల్ సలహాలనిస్తారు. మాయా తుఫాన్లు అయితే చాలా వస్తాయి. కానీ మహావీరులుగా అవ్వాలి. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సేవ పట్ల అభిరుచి ఉంచి తమ మరియు ఇతరుల కళ్యాణం చేయాలి. ఎవరి డిస్సర్వీసును వర్ణించకూడదు. పరచింతనలో తమ సమయాన్ని పోగొట్టుకోకూడదు.

2. నిజాయితీపరులుగా మరియు నిరహంకారులుగా అయ్యి సేవను వృద్ధి చేయాలి. ఉదయాన్నే లేచి తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి. చెప్పడం మరియు చేయడాన్ని సమానంగా చేసుకోవాలి.

వరదానము:-

సదా సఫలతను పొందేందుకు తండ్రి మరియు పరివారంతో సరైన కనెక్షన్ ఉండాలి. ప్రతి ఒక్కరు 3 సర్టిఫికెట్లు తీసుకోవాలి – తండ్రి నుండి, స్వయం నుండి మరియు పరివారం నుండి. పరివారాన్ని సంతుష్టపరిచేందుకు ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి – రిగార్డ్ (గౌరవం) ఇచ్చే రికార్డు నిరంతరం నడుస్తూ ఉండాలి, ఇందులో నిష్కాములుగా అవ్వండి. తండ్రిని సంతుష్టపరిచేందుకు సత్యమైనవారిగా అవ్వండి మరియు స్వయం సంతుష్టంగా ఉండేందుకు సదా శ్రీమతమనే గీత లోపల ఉండండి. ఈ 3 సర్టిఫికెట్లు ఉన్నత పదవికి అధికారులుగా చేస్తాయి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top