07 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

07 August 2021 TELUGU Murli Today | Brahma Kumaris

Read and Listen today’s Gyan Murli in Telugu 

6 August 2021

Morning Murli. Om Shanti. Madhuban.

Brahma Kumaris

నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.

“మధురమైన పిల్లలూ - దేహ సహితంగా దేహ ధర్మాలన్నింటినీ మరచి స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే, దుఃఖాలన్నీ దూరమవుతాయి అనే సందేశాన్ని అందరికీ ఇవ్వండి”

ప్రశ్న: -

పిల్లలైన మీరు ఏ విషయంలో ఫాలో ఫాదర్ చేయాలి?

జవాబు:-

ఎలాగైతే ఈ బ్రహ్మా తమ సర్వస్వాన్ని ఈశ్వరునికి అర్పించారో, పూర్తిగా ట్రస్టీగా అయ్యారో, అలా ట్రస్టీలుగా అయి ఉండండి. ఎప్పుడూ కూడా తప్పుగా ఖర్చు చేసి పాపాత్ములకు ఇవ్వకూడదు. తమదంతా ఈశ్వరీయ సేవలో వినియోగించండి, పూర్తిగా ట్రస్టీలుగా అవ్వండి. తండ్రి శ్రీమతంపై నడుస్తూ ఉండండి. శ్రీమతంపై ఏ బిడ్డ ఎంతగా నడుస్తున్నారు అనేది తండ్రి చూస్తారు.

♫ వినండి ఆడియో (audio)➤

గీతము:-

నీవు ప్రేమ సాగరుడవు… (తూ ప్యార్ కా సాగర్ హై…)

ఓంశాంతి. పిల్లలు పాటను విన్నారు. పిల్లలు అడుగుతారు – బాబా, మేము ఎక్కడ నుండి వచ్చాము, ఎప్పుడు వచ్చాము, మళ్ళీ తిరిగి వెళ్ళే మార్గాన్ని ఎలా మర్చిపోయాము, ఈ డ్రామా గురించి మా చెవిలో వినిపించండి, మేము ఎవరిమి, ఎక్కడ నుండి వచ్చాము, ఎక్కడికి వెళ్ళిపోయాము! జ్ఞానం యొక్క ఒక్క బిందువునైనా ఇవ్వండి ఎందుకంటే మీరు జ్ఞాన సాగరుడు కదా. ఆత్మలైన మనం ఎక్కడ నివసించేవారము అనేది ఇప్పుడు పిల్లలకు తెలుసు. తండ్రిని మరియు మా స్వర్గాన్ని ఎలా మర్చిపోయాము మరియు ఏ విధంగా వచ్చి ఇక్కడ దుఃఖితులుగా అయ్యాము అనే రహస్యాలను చెవిలో వినిపించండి. ఇప్పుడు, తండ్రి జ్ఞానసాగరుడు కూడా, పవిత్రత సాగరుడు కూడా, ప్రేమ సాగరుడు కూడా. వారు శాంతి, సుఖము మరియు సంపద యొక్క సాగరుడు కూడా. ఇప్పుడు అనంతమైన తండ్రి ద్వారా ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటారు – ఆదిలో ఎక్కడ నుండి వచ్చాము, తర్వాత మధ్యలో ఏమి జరిగినందుకు మేము మార్గాన్ని మరచి దుఃఖితులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ తండ్రిని అడుగుతారు – బాబా, మాకు మార్గాన్ని తెలియజేయండి. మేము మా సుఖధామం, శాంతిధామానికి వెళ్ళాలి. తండ్రియే కూర్చొని – ఆదిలో మీరు ఎవరు, తర్వాత మధ్యలో ఏమి జరిగింది అనేది తెలియజేస్తారు. భక్తి మార్గం ఎలా మొదలైంది, అంతిమంలో ఏమి జరిగింది అనే ఈ ఆదిమధ్యాంతాల రహస్యాలు ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చొని ఉన్నాయి. ఇది డ్రామా కదా. దీని గురించి మనుష్యులు తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే వారు ఇందులో పాత్రధారులు. ఆత్మలైన మనం నిరాకార శాంతిధామం నుండి ఇక్కడ టాకీ ధామంలోకి (శబ్ద ధామంలోకి) వచ్చామని మీకు తెలుసు. మూలవతనం, సూక్ష్మవతనం మరియు ఇది స్థూలవతనము. ఆత్మలు మూలవతనం నుండి టాకీ ధామంలోకి శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయించేందుకు వస్తాయి. ఆత్మల నివాస స్థానం శాంతిధామము. ఈ విషయాల గురించి ప్రపంచంలోని వారెవ్వరికీ తెలియదు. ఇదంతా జ్ఞానసాగరుడైన తండ్రియే వచ్చి అర్థం చేయించారు. పారలౌకిక పరమపిత పరమాత్మను జ్ఞానసాగరుడు అంటారని ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మనుష్యులను జ్ఞానసాగరుడని అనలేరు. ఈ మహిమ కేవలం ఒక్క తండ్రికి మాత్రమే గాయనం చేయబడుతుంది, వారి గురించి ఇంకెవరికీ తెలియదు. ఇప్పుడిది వినాశన సమయము. వినాశకాలే యూరోప్ వాసుల విపరీత బుద్ధి… అని అంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రి – నన్నొక్కరినే స్మృతి చేయండి అని అంటూ మీ బుద్ధియోగాన్ని వారితో జోడించేలా చేసారు. నేను ముస్లిమ్ ను, హిందువును, బౌద్ధుడను… ఇవన్నీ దేహానికి సంబంధించిన ధర్మాలు. ఆత్మ అయితే ఆత్మనే. తండ్రి అర్థం చేయిస్తున్నారు – దేహపు ధర్మాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ, తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే పతితుల నుండి పావనంగా అవుతారు. ఈ దేహాన్ని కూడా మర్చిపోండి అని తండ్రి అంటారు. ఇది అందరి కోసము తండ్రి ఇచ్చేటువంటి సందేశము. దేహ సహితంగా దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, వాటన్నింటినీ మర్చిపోండి. నేను ఆత్మను, సోదరులైన మనందరి తండ్రి ఒక్కరే. మనము ఆత్మలము కావున పరస్పరంలో అందరము సోదరులు అయినట్లే అని ఈ బ్రహ్మా కూడా అంటారు. ఈ సమయంలో సోదరులందరూ పతితులుగా, దుఃఖితులుగా ఉన్నారు. అందరూ కామ చితిపై కూర్చొని భస్మమైపోయారు. ద్వాపరయుగం ఆదిలో రావణ రాజ్యం మొదలైనప్పుడు మీరు మళ్ళీ వామ మార్గంలోకి వెళ్తారు. అప్పుడే ఇతర ధర్మాలు ప్రారంభమవుతాయి. అర్ధ సమయం మీరు పవిత్రంగా ఉంటారు. మిగతా అర్ధ సమయంలో మీరు పతితులుగా అవుతారు. 21 జన్మలు భారత్ లోనే మహిమ చేయబడతాయి. కుమారీ అంటే 21 కులాలను ఉద్ధరించేవారు. కుమారీలకు గౌరవముంటుంది. మీరు కేవలం భారత్ ను మాత్రమే కాదు, ప్రపంచమంతటినీ ఉద్ధరిస్తున్నారు. ఆత్మలైన మనమంతా శివబాబాకు పిల్లలమని మీకు తెలుసు, కావున కుమారులు అయినట్లు. ప్రజాపిత బ్రహ్మాకు సంతానమైనప్పుడే సోదరీ-సోదరులుగా అవుతారు. పిల్లలైన మీకు ఈ జ్ఞానముంది. ఆత్మలైన మనమంతా సోదరులము, అందరూ తండ్రిని – హే పతితపావనా రండి, ఇక్కడి రావణ రాజ్యం నుండి, దుఃఖం నుండి మమ్మల్ని ముక్తులుగా చేయండి, తర్వాత మాకు మార్గదర్శకునిగా అయి మమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళండి, మా దుఃఖాలను హరించి సుఖాన్ని ఇవ్వండి అని పిలుస్తారు. నిజంగా ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారని మీరు అర్థం చేసుకుంటారు. మనల్ని ఈ కలియుగీ రావణ రాజ్యం నుండి విడిపించి తమతో పాటు తీసుకువెళ్తారు. ఆత్మలందరూ పతితులుగా ఉన్నారు, అందుకే శరీరాలు కూడా పతితంగా ఉన్నాయని తండ్రికి తెలుసు. ఆత్మలనే పావనంగా చేసి నిర్వాణధామానికి తీసుకువెళ్తారు. గతము, వర్తమానముగా అవుతుంది, తర్వాత భవిష్యత్తుగా అవుతుంది. ఆది-మధ్య-అంతిమము, మళ్ళీ ఆది ఉంటుంది. సత్యయుగం ఆది, కలియుగం అంతిమము, మళ్ళీ భవిష్యత్తులో సత్యయుగం ఉంటుంది. ఇది సహజము కదా. అచ్ఛా, మధ్యలో ఏమి జరిగింది? మనమెలా పడిపోయాము? మనం పావన దేవతలుగా ఉండేవారము, తర్వాత పావనం నుండి పతితంగా ఎలా అయ్యాము అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి అర్థం చేయిస్తారు – రావణ రాజ్యం ప్రారంభమైనప్పుడు మీరు పతితులుగా అవుతారు, ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని భవిష్య దేవతలుగా తయారుచేసేందుకు నేను వచ్చాను. ఇందులో కష్టము అనే విషయమేమీ లేదు. మిమ్మల్ని ఈ విషయసాగరాన్ని దాటిస్తానని తండ్రి అంటారు. మా నావను తీరానికి చేర్చండని పాడుతారు కూడా. మునిగి ఉన్న మా నావను క్షీరసాగరంలోకి తీసుకువెళ్ళండి అని అందరూ ఒక్క తండ్రినే పిలుస్తారు. తండ్రిని నావికుడని, తోట యజమాని అని కూడా అంటారు. ఇప్పుడు ముళ్ళ అడవిలో ఉన్నాము, మమ్మల్ని మళ్ళీ పుష్పాల తోటలోకి తీసుకువెళ్ళండి. దేవతలు పుష్పాల వంటివారు కదా. ఇప్పుడు అందరూ ముళ్ళ వలె ఉన్నారు. ఒకరికొకరు దుఃఖమే ఇచ్చుకుంటూ ఉంటారు. దేవతలు ఎప్పుడూ ఎవరికీ దుఃఖమివ్వరు. అక్కడ సుఖమే సుఖముంటుంది. వారు కేవలం పాడుతారు, కానీ ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా వింటున్నారు. బాబా, మేము ఎప్పటి నుండి మర్చిపోయాము, ఈ సృష్టి చక్రాన్ని ఎలా మర్చిపోయాము అని అడుగుతారు కదా. సత్య-త్రేతా యుగాలలో ఇవేమీ తెలియదు, ఎందుకంటే అక్కడ మనం సుఖంగా ఉండేవారము, మరి దుఃఖితులుగా ఎప్పుడయ్యాము? రావణ రాజ్యం మొదలైనప్పుడు. రావణుడు వినాశనం అవ్వనంత వరకు భారతవాసులు అతడిని కాలుస్తూనే ఉంటారు. తర్వాత సత్యయుగంలో ఇలా ప్రతి సంవత్సరం కాల్చరు. ఇది భక్తి మార్గము. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తమవ్వనున్నది. భక్తి మార్గంలో రావణుడిని ప్రతి సంవత్సరం కాలుస్తారు కానీ రావణుడు మరణించడు. ఇప్పుడు, మీ ఎదురుగా రావణుడు మరణించి ఉన్నట్లే. ఇప్పుడు రావణ రాజ్యం సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. 5 భూతాల తలలను ఖండించడం జరుగుతుంది. మొట్టమొదటగా కామ వికారం యొక్క తలను ఖండిస్తారు. కామమే మహాశత్రువు. తండ్రి అంటారు – ఈ 5 భూతాలపై విజయం పొందినప్పుడే మీరు విశ్వంపై విజయం పొందుతారు. మేము పతితులము అని మనుష్యులు కూడా స్వయంగా అంటారు, అందుకే – పతితులను పావనంగా చేయడానికి రండి అని పిలుస్తారు. హే పతితపావనా, హే బాబా… నావికుడా, దయాహృదయుడైన బాబా రండి అని ఆత్మ పిలుస్తుంది. తండ్రి అంటారు – నేను కల్ప-కల్పము వస్తాను, నేను ఏ విధంగా వస్తాను అనేది ఎవరికీ తెలియదు. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారని గీతలో కూడా ఉంది. కానీ భగవంతుడు ఎవరు, ఎప్పుడు వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. గీతను ఖండించేసారు. కృష్ణుడిని ద్వాపర యుగంలోకి తీసుకువెళ్ళారు. ద్వాపరయుగం తర్వాత ప్రపంచం ఇంకా పతితమైపోతుంది, మరి ద్వాపరయుగంలో కృష్ణుడు వచ్చి ఏమి చేసారు. మనుష్యులు ఏమీ అర్థం చేసుకోరు. పూర్తిగా అన్ రైటియస్ గా (అధర్మయుక్తంగా) ఉన్నారు. సత్యయుగంలో రైటియస్ గా (ధర్మయుక్తంగా) ఉంటారు. ఇప్పుడు మీరు అధర్మయుక్తమైనవారి నుండి ధర్మయుక్తమైనవారిగా అవుతున్నారు. తండ్రి అర్థం చేయిస్తారు – మీరే సంపూర్ణ నిర్వికారులుగా, పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు మీరే వికారులుగా, పూజారులుగా అయ్యారు. మీరే పూజ్యులుగా ఉండేవారు, మీరే పూజారులుగా అయ్యారు… ముందు 21 జన్మల వరకు మీరు పూజ్యులుగా ఉండేవారు, తర్వాత పూజారులుగా అయ్యారు. సత్యయుగంలో 8 జన్మలు, తర్వాత త్రేతాయుగంలో 12 జన్మలు తీసుకుంటారు. మీరు పతితులుగా ఎలా అయ్యారని, ఎప్పటి నుండి పడిపోయారని, ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుందని తండ్రియే తెలియజేస్తారు. మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర-భూగోళాల గురించి, ఆదిమధ్యాంతాల రహస్యాల గురించి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తారు. అందరూ ఒకేలా అర్థం చేసుకోరు. నంబరువారుగానే అర్థం చేసుకుంటారు.

తండ్రి అంటారు – నేను వచ్చి రాజ్యాన్ని స్థాపన చేస్తాను. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవ్వాలి, అప్పటివరకు సత్యయుగంలోకి వెళ్ళలేరు. ఇక్కడే అలా తయారవ్వాలి, తర్వాత భవిష్యత్తులో మీరు రాజ్యం చేస్తారు. ఈ మధ్యలోనే అంతా వినాశనమైపోతుంది. మీరు వినాశనాన్ని కూడా తప్పకుండా చూస్తారు. మీరు ప్రాక్టికల్ గా మీ పాత్రను అభినయిస్తారు. మున్ముందు ఏమి జరుగబోతుంది అనేది మీకు తెలియదు. కల్పక్రితం ఏదైతే జరిగి ఉంటుందో, అదే జరుగుతుంది.

స్థాపన మరియు వినాశనం జరుగనున్నదని మీకు మొత్తం అర్థం చేయించడం జరుగుతుంది. వినాశనం ఎలా జరుగుతుంది? అది జరిగినప్పుడు చూస్తారు. దివ్యదృష్టితో వినాశనాన్ని చూసారు. మున్ముందు ప్రాక్టికల్ గా కూడా చూస్తారు. స్థాపన యొక్క సాక్షాత్కారాలను కూడా దివ్యదృష్టితోనే చూసారు, తర్వాత ప్రాక్టికల్ గా కూడా చూస్తారు. ఇకపోతే, ధ్యానంలోకి ఎక్కువగా వెళ్ళడం కూడా మంచిది కాదు. అప్పుడు వైకుంఠంలోకి వెళ్ళి డ్యాన్స్ చేయడం మొదలుపెడతారు. జ్ఞానము ఉండదు, యోగము ఉండదు, రెండింటి నుండి వంచితులైపోతారు. ధ్యానంలోకి వెళ్ళాల్సిన అవసరమేమీ లేదు. కేవలం భోగ్ పెట్టడం జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు అక్కడికి వెళ్తారు. దేవతలు మరియు బ్రాహ్మణుల సభ జరుగుతుంది. ఇక్కడ మీరు పుట్టింటిలో కూర్చొని ఉన్నారు, తర్వాత మిమ్మల్ని విష్ణుపురిలోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేయడం జరుగుతుంది. కన్యకు నిశ్చితార్థం చేసేటప్పుడు – అత్తవారింట్లో ఎలా నడుచుకోవాలని, అందరితో ప్రేమగా వ్యవహరించాలని, గొడవపడకూడదని ఆమెకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. మీరు సర్వగుణ సంపన్నులుగా ఇక్కడే తయారవ్వాలని తండ్రి చెప్తారు. స్వర్గములో ఈ యుద్ధాలు-గొడవలు మొదలైనవి ఉండవు. ఇప్పుడు మీరు అత్తవారిల్లు అయిన విష్ణుపురికి వెళ్తారు. అక్కడ మహాన్ వైష్ణవులు ఉంటారు. వారిలాంటి వైష్ణవులు ఈ సృష్టిలో ఉండరు. వైష్ణవులైన దేవతలు వికారాలలోకి వెళ్ళరు. వికారాలు అనగా హింస. అహింసా పరమో దేవీ దేవతా ధర్మమని అంటారు. ఇప్పుడు మీరు పుట్టింట్లో కూర్చొని ఉన్నారని, తర్వాత విష్ణుపురిలోకి వెళ్ళాలని మీకు తెలుసు. అక్కడ చాలా సుఖం ఉంటుందని మీకు తెలుసు. వివాహానికి ముందు కన్య చిరిగిన వస్త్రాలను ధరిస్తుంది, దానిని వనవాహమని అంటారు. ఇప్పుడు మీ వద్ద కూడా ఏముంది? ఏమీ లేదు. ఇవన్నీ రాళ్ళు-రప్పలే. ఇక్కడ మీరు నగలు మొదలైనవి ధరించాల్సిన అవసరం లేదు. కానీ గృహస్థంలో ఉండాలని చెప్పడం జరుగుతుంది. వివాహాలు మొదలైనవాటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు నగలు మొదలైనవి ధరిస్తే ధరించండి, వద్దు అని చెప్పరు. లేదంటే విధవ అని, నగలు ధరించటం లేదు అని అంటారు. పేరు అప్రతిష్ఠపాలు అవుతుంది. అందుకే, పేరును అప్రతిష్ఠపాలు చేయకూడదు అని బాబా అంటారు. ఏదైనా ధరించండి, కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఎక్కడికైనా వెళ్ళండి, కానీ ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి. మేము స్మృతిలో ఉంటున్నామా అని పరీక్షించుకోండి. అక్కడకు మేము బాబా డైరెక్షన్ అనుసారంగా వెళ్తున్నామని అనుకోండి. వారితో కూడా యుక్తియుక్తంగా సంబంధం నిర్వర్తించాలి. కానీ, చేతులతో పని చేస్తూ, మనస్సు ప్రియతముని పట్ల ఉండాలి, అప్పుడు వీరు ధృఢమైనవారని భావిస్తారు. నగలు మొదలైనవి ధరించి వివాహాలకు వెళ్తే వెళ్ళండి, అందరితో కలిసి ఉండండి, కానీ మహావీరులుగా అవ్వాలి. గురువులు సన్యాసులను పరీక్షించేందుకు వారిని వేశ్య వద్దకు పంపించినట్లుగా, సర్పం వద్దకు పంపించినట్లుగా చూపిస్తారు కదా. ఎవరైతే ధైర్యంగా పాస్ అయి చూపిస్తారో, వారిని మహావీరులని అంటారు. తండ్రి స్మృతిలో ఉన్నట్లయితే ఏ కర్మేంద్రియాలలోనూ చంచలత్వం ఉండదు. తండ్రిని మర్చిపోతే కర్మేంద్రియాలు చంచలమవుతాయి. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు, ఇదేమైనా తక్కువ విషయమా! సన్యాసులకు అసలు ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. శాస్త్రాలలో కొన్ని విషయాలు ఉన్నాయి కానీ వాటిని ఖండించేసారు. భగవానువాచ – నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. జీవించి ఉన్నంత వరకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఉంటారు, వింటూ ఉంటారు. రాజధాని స్థాపనవుతుంది. పిల్లలకు పదే-పదే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది – ఒక్క తండ్రినే స్మృతి చేయండి, దైవీ లక్షణాలను నేర్చుకోండి. ఏ వికర్మలు చేయకూడదు. అది అసురుల పని. ఇప్పుడు మీరు దేవతలుగా అవుతున్నారు కనుక దైవీ గుణాలను ధారణ చేయాలి. కామము అన్నింటికంటే పెద్ద ముల్లు. ఇది అలవాటైపోయింది కనుక పదే-పదే పడిపోతూ ఉంటారు, మాయ చెంపదెబ్బ వేసి కింద పడిపోయేలా చేస్తుంది. అప్పుడు, ఆశ్చర్యంగా వింటారు, వినిపిస్తారు, మళ్ళీ బాబాను వదిలి వెళ్ళిపోతారు… అని అంటారు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రికి చెందినవారిగా అయ్యారు. ఇదంతా ఈశ్వరుడు ఇచ్చినదే అని అంటారు కూడా. కావున, మీరు ట్రస్టీలుగా అయినట్లు. ఇదంతా తండ్రిదే, మనం వారి శ్రీమతంపై నడుచుకోవాలి. అంతా వారికి అర్పణ చేసి, శ్రీమతంపై ఎలా నడుచుకుంటారు, తప్పుగా ఖర్చు చేసి పాపాత్ములకు ఇవ్వడం లేదు కదా అని బాబా కూడా చూస్తారు. మొదట్లో ఇతను (బ్రహ్మా) కూడా ట్రస్టీగా అయ్యి చూపించారు కదా. అంతా ఈశ్వరునికి అర్పణ చేసి స్వయం ట్రస్టీగా అయ్యారు. ఇంకెవరికీ ఏమీ ఇవ్వలేదు. ఈశ్వరార్థం చేసినప్పుడు ఈశ్వరుని కార్యంలోనే వినియోగించాలి. శరీర నిర్వహణ కూడా జరుగుతూ ఉండేది కదా. ఉన్నదంతా సేవలో పెట్టేసారు. వీరిని చూసి ఇతరులు కూడా అలాగే చేసారు. భట్టీ తయారయ్యింది. భట్టి తయారై ఉండకపోతే సేవ కోసం ఇంతమంది పిల్లలు చురుకైనవారిగా ఎలా తయారయ్యేవారు. పాకిస్తాన్ లో నేర్చుకున్నారు, తర్వాత ఇక్కడకు వచ్చి నేర్చుకున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకు యోగ్యులుగా అయినప్పుడు బయటకు వెళ్ళారు. ఇప్పుడు చూడండి, ఎన్ని ప్రదర్శనీలు మొదలైనవి పెడుతూ ఉంటారు. పెద్ద-పెద్దవారిని ఆహ్వానిస్తారు. ఈ జ్ఞాన యజ్ఞంలో విఘ్నాలు కూడా అనేక రకాలుగా వస్తాయి. విఘ్నాలకు భయపడకూడదు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. యోగబలంతో వారికి అర్థం చేయించండి అని తండ్రి చెప్తారు. తండ్రి అయిన భగవంతునికి పిల్లలుగా అయ్యాక కూడా వారిని మర్చిపోతారు. మాయకు చెందినవారిగా అయిపోతారు. ఇది కూడా గెలుపు-ఓటముల కుస్తీయే. కానీ ఇది బాక్సింగ్ వంటిది. మాయ దెబ్బ వేసిందంటే, కింద పడిపోతారు. మాయతో ఎప్పుడూ ఓడిపోకూడదని తండ్రి అంటారు. పవిత్రంగా ఉన్నట్లయితే విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇది ఎంత గొప్ప సంపాదన. ఒకవేళ పూర్తి పురుషార్థం చేయకపోతే అక్కడకు వెళ్ళి దాస-దాసీలుగా అవుతారు. రాజధాని అంతా ఇక్కడే స్థాపనవుతుంది. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. జీవించి ఉన్నంత వరకు జ్ఞానామృతాన్ని తాగుతూ ఉండాలి. మహావీరులుగా అయి మాయ బాక్సింగ్ లో విజయులుగా అవ్వాలి. అందరితో యుక్తియుక్తంగా సంబంధాన్ని నిర్వర్తిస్తూ, ఒక్క తండ్రిపైనే మనసును పెట్టుకోవాలి.

2. విఘ్నాలకు భయపడకూడదు. సేవలో తమ సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ఈశ్వరార్పణ చేసి ట్రస్టీలుగా అయి ఉండాలి. దేనినీ తప్పుడు పనుల్లో వినియోగించకూడదు.

వరదానము:-

ఎలాగైతే కర్మలలోకి రావడం సహజమైపోయిందో, అలా కర్మాతీతులుగా అవ్వడం కూడా సహజమవ్వాలి, దీని కోసం డబల్ లైట్ గా ఉండండి. డబల్ లైట్ గా ఉండడానికి కర్మలు చేస్తూ స్వయాన్ని ట్రస్టీగా భావించండి మరియు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. ఈ రెండు విషయాల పట్ల అటెన్షన్ పెట్టడంతో సెకండులో కర్మాతీతులుగా, సెకండులో కర్మయోగులుగా అయిపోతారు. నిమిత్తమాత్రంగా కర్మలు చేసేందుకు కర్మయోగులుగా అవ్వండి, తర్వాత కర్మాతీత అవస్థను అనుభవం చేయండి.

స్లోగన్:-

Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu

Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
Scroll to Top