06 November 2021 TELUGU Murli Today | Brahma Kumaris
Read and Listen today’s Gyan Murli in Telugu
5 November 2021
Morning Murli. Om Shanti. Madhuban.
Brahma Kumaris
నేటి శివ బాబా సకర్ మురళి, బాబ్దాడ, మధుబన్। Brahma Kumaris (BK) Murli for today in Telugu. This is the Official Murli blog to read and listen daily murlis.
“మధురమైన పిల్లలూ - సంగమయుగంలో మీకు తండ్రి ద్వారా మంచి బుద్ధి మరియు శ్రేష్ఠ మతం లభిస్తుంది, దీని ద్వారా మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారవుతారు”
ప్రశ్న: -
పిల్లలైన మీరు ఏ నషాలో ఉన్నట్లయితే నడవడిక చాలా రాయల్ గా తయారవుతుంది?
జవాబు:-
మీకు జ్ఞానం యొక్క నషా ఎక్కి ఉండాలి. ఓహో! మేము భగవంతుని సమ్ముఖంలో కూర్చొని ఉన్నాము. మేము ఇక్కడి నుండి వెళ్తాము, వెళ్ళి విశ్వానికి యజమానులుగా, కిరీటధారి రాకుమారులుగా తయారవుతాము అనేటువంటి నషాలో ఉన్నప్పుడు నడవడిక స్వతహాగా రాయల్ గా తయారవుతుంది. నోటి నుండి చాలా మధురమైన మాటలు వెలువడతాయి. పరస్పరంలో చాలా ప్రేమ ఉంటుంది.
♫ వినండి ఆడియో (audio)➤
గీతము:-
సభలో జ్యోతి వెలిగింది..
ఓంశాంతి. మధురాతి-మధురమైన పిల్లలు, ఆత్మిక పిల్లలు ఇక్కడకు వచ్చి బ్రాహ్మణులుగా అయి, ఆత్మిక తండ్రి ద్వారా – మనం సంగమయుగ బ్రాహ్మణులమని తప్పకుండా అర్థం చేసుకున్నారు. తండ్రి మన బుద్ధి తాళాన్ని తెరిచారు. ఇది సంగమయుగమని ఇప్పుడు మనం అర్థం చేసుకుంటాము. మనుష్యులు ఎవరైతే పతితులుగా, భ్రష్టాచారులుగా ఉన్నారో, వారు పావనంగా అయి భవిష్యత్తులో పావనులు, శ్రేష్ఠాచారులు, పురుషోత్తములు అని పిలవబడతారు. ఈ లక్ష్మీనారాయణులు ఎప్పుడోకప్పుడు పురుషార్థం చేసి పురుషోత్తములుగా అయ్యారు కదా. వీరి చరిత్ర తప్పకుండా కావాలి. ఈ లక్ష్మీ నారాయణుల రాజ్యం ఎప్పుడు స్థాపన జరిగింది? కలియుగంలోనూ స్థాపన జరగలేదు, సత్యయుగంలోనూ స్థాపన జరగలేదు. సంగమంలోనే స్వర్గం స్థాపనవుతుంది. ఇంత విస్తారంలోకి ఎవ్వరూ వెళ్ళరు. ఇది సంగమయుగమని మీకు తెలుసు. కలియుగం తర్వాత కొత్త ప్రపంచమైన సత్యయుగం వస్తుంది, కనుక తప్పకుండా సంగమయుగం కూడా ఉంటుంది. తర్వాత కొత్త ప్రపంచంలో కొత్త రాజ్యముంటుంది. బుద్ధి నడవాలి. తండ్రి ద్వారా మనకు మంచి బుద్ధి మరియు శ్రీమతం లభిస్తుందని మీకు తెలుసు. ఓ ఈశ్వరా, వీరికి సదా సుమతము అనగా మంచి మతాన్ని ఇవ్వండి అని అంటారు. వారు మొత్తం ప్రపంచమంతటికీ తండ్రి. అందరికీ మంచి మతాన్ని ఇచ్చేవారు. సంగమయుగంలో వచ్చి, తమ పిల్లలకు మంచి మతాన్ని ఇస్తారు. వీరి గురించే పాండవ సంప్రదాయము, దైవీ సంప్రదాయమని శాస్త్రాలలో రాయబడి ఉంది. బ్రాహ్మణ సంప్రదాయం మరియు దైవీ సంప్రదాయం గురించి కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. బ్రహ్మా ద్వారానే బ్రాహ్మణ సంప్రదాయం వారు తయారవుతారు. పరమపిత పరమాత్మనే బ్రహ్మా ద్వారా ఈ రచనను రచిస్తారు. ప్రజాపిత ఉన్నారు కనుకనే ఇంతమంది బ్రహ్మాకుమారులు-బ్రహ్మాకుమారీలు ఉన్నారు. ఎవరైనా వచ్చి బ్రాహ్మణులైన మీ ద్వారా జ్ఞానాన్ని తీసుకోనంతవరకు సద్గతి ఎలా లభిస్తుంది. మీ వద్దకు చాలా మంది వస్తారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు సన్యాసులు కూడా వస్తారు, ఇతర ధర్మాల వారు కూడా వస్తారు. స్వర్గంలో వారి పాత్ర లేదు కానీ తండ్రి వచ్చారు అనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి. ఈ సమయంలో ‘హిందువులు’ అని పిలవబడేవారు ఎవ్వరికీ దేవీ-దేవతా ధర్మం గురించి తెలియదు. ముందు సతోప్రధానంగా ఉన్నవారే, తమోలోకి వచ్చిన కారణంగా స్వయాన్ని దేవీ-దేవతలుగా పిలిపించుకోలేరు. పిల్లలైన మీకు తెలుసు – రావణ రాజ్యం కూడా ఇక్కడే ఉంటుంది మరియు పరమపిత పరమాత్మ, ఎవరినైతే రామ అని కూడా అంటారో, వారి జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది అని. పతితపావన సీతా రామ అని కూడా పాడుతారు. కానీ పతితులుగా ఎవరు తయారుచేసారు, రావణుడు ఎవరు, పతితపావనుడైన తండ్రిని ఎందుకు పిలుస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. మనలో ఉన్న 5 వికారాలే రావణుడు అన్న విషయాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఎవరిలోనైతే 5 వికారాలు ఉండవో, వారు రాముని సంప్రదాయానికి చెందినవారు. ఇప్పుడు రామరాజ్యం లేదు. అందుకే అందరూ కొత్త ప్రపంచం, కొత్త పవిత్ర రాజ్యం కావాలని కోరుకుంటారు. ‘రామ’ అని శివబాబాని అంటారు, కానీ వారు రాముడిని పరమాత్మగా భావించారు కనుక శివబాబాను మర్చిపోయారు. రామ రాజ్యమని దేనినంటారో మీరు అర్థం చేయించవచ్చు. రాముడి సీత అపహరించబడినట్లుగా శాస్త్రాలలో రాసేసారు, ఈ విధంగా ఒక రాజు యొక్క రాణిని ఎవరైనా అపహరించి తీసుకువెళ్ళడమనేది జరగగలదా. శాస్త్రాలు కూడా అనేకమున్నాయి. ముఖ్యమైన శాస్త్రము గీత. బ్రహ్మా ద్వారా బ్రాహ్మణ, దేవతా, క్షత్రియ ధర్మాలను స్థాపిస్తారని శాస్త్రాలలో రాయబడి ఉంది. కావున ప్రజాపిత కూడా ఇక్కడే ఉండాలి. బ్రహ్మాకు ఇంతమంది పిల్లలున్నారంటే వీరు ముఖవంశావళి పిల్లలు, ఇంతమంది కుఖవంశావళి (గర్భం ద్వారా జన్మించిన) వారు ఉండరు. సరస్వతి కూడా ముఖవంశావళి కనుక ఆమె బ్రహ్మాకు పత్ని కాలేరు. ఇప్పుడు తండ్రి అంటారు – బ్రహ్మా నోటి ద్వారా మీరు బ్రాహ్మణులుగా అవుతారు, నా పిల్లలుగా అవుతారు. శివబాబాకు ఎంత మహిమ ఉంది అనేది పిల్లలైన మీకు తెలుసు. తండ్రి పతితపావనుడు మరియు ముక్తిదాత కూడా. ఇలా అందరూ మహిమ చేస్తారు కానీ అర్థం చేసుకోరు, కనుక – వారు పతితపావనుడు మరియు గీతా భగవంతుడు కూడా అని ముందు తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. శివబాబా నిరాకారుడు కనుక తప్పకుండా వచ్చి జ్ఞానాన్ని వినిపించి ఉంటారు. ఇప్పుడు ఎవరి శరీరం ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారో, వారి పేరును ‘బ్రహ్మా’ అని పెట్టారు. లేదంటే బ్రహ్మా ఎక్కడ నుండి వస్తారు! బ్రహ్మాకు తండ్రి ఎవరు? బ్రహ్మా, విష్ణు, శంకరుల రచయిత ఎవరు? ఇవి గుహ్యమైన ప్రశ్నలు. త్రిమూర్తి దేవతలు అని అయితే అంటారు కానీ వారు ఎక్కడ నుండి వచ్చారు! ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, వీరి రచయిత కూడా ఉన్నతోన్నతమైన భగవంతుడే, వారిని ‘శివ’ అని అంటారు. ఈ 3 దేవతలు లైట్ (ప్రకాశ) రూపం కలవారు, ఎముకలు, మాంసము ఉండవు కానీ మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు అన్న దాని గురించి అర్థం చేయించాలి. వారు బ్రహ్మా ద్వారా స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసారు… అని పాడుతారు కూడా. తర్వాత విష్ణువు నాభి నుండి బ్రహ్మా వెలువడినట్లు చూపిస్తారు. ఎప్పుడైనా నాభి నుండి పిల్లలు జన్మిస్తారా? ఇప్పుడు తండ్రి కూర్చొని రహస్యాలన్నీ అర్థం చేయిస్తారు. కానీ ఎవరైనా అర్థం చేసుకోవాలి కదా.
ఆత్మనే పాపాత్మ, పుణ్యాత్మ అని అంటారని మీకు తెలుసు. అలాగని పవిత్ర ఆత్మనే పరమాత్మ అని కాదు. పరమాత్మ అయిన తండ్రి సదా పావనమైనవారు. తమోప్రధానంగా ఉన్నవారిని పతితులని అంటారు. సత్యయుగంలో సుఖమున్నప్పుడు దుఃఖము అన్న పేరు కూడా ఉండేది కాదు. ఇదే స్వర్గమని మనుష్యులంటారు. ఏ మాత్రము అర్థం చేసుకోరు, కానీ చివర్లో వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. మేమిప్పుడు మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నామని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. విశ్వానికి యజమానులుగా ఇంకెవ్వరూ అవ్వలేరు. సత్యయుగంలో విశ్వంపై రాజ్యం చేస్తారు. కలియుగంలో పూర్తి విశ్వంపై ఎవ్వరూ రాజ్యం చేయలేరు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మహాభారత యుద్ధం జరిగిందని గీతలో కూడా ఉంది, అప్పుడే అన్ని ధర్మాలు వినాశనమవుతాయి. వెదురు అడవి ఎండిపోయినప్పుడు, అవి పరస్పరంలో ఒకదానికొకటి రాసుకున్నప్పుడు నిప్పు అంటుకుంటుంది మరియు అడవి అంతా కాలిపోతుంది. ఈ మనుష్య సృష్టి వృక్షం కూడా శిథిలావస్థకు చేరుకుంది. దీనికి కూడా నిప్పు అంటుకున్నప్పుడు, పరస్పరం ఒకరితో ఒకరు గొడవపడి సమాప్తమైపోతారు. పేలుడు పదార్థాలను తయారుచేస్తూనే ఉంటారు. ఇప్పుడు అణు బాంబుల ద్వారా నిప్పు అంటుకోనున్నది అనే రహస్యం వారికి తెలియదు. ఇప్పుడు కలియుగ నరకం పరివర్తనై స్వర్గంగా అవ్వనున్నది. ఈ జ్ఞానంలో చాలా నషా ఉండాలి. నేను ఆ నషాలో ఉంటున్నానా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి. మనం పరమాత్ముని సంతానం, వారి నుండి స్వర్గ వారసత్వాన్ని పొందుతున్నాము. పరస్పరంలో మాట్లాడుకునే విధానంలో రాయల్టీ ఉండాలి. ఇక్కడి నుండి అంతా నేర్చుకోవాలి. తర్వాత ఆ సంస్కారాలనే తీసుకువెళ్తారు. అతి మధురంగా తయారవ్వాలి, చాలా నషా ఉండాలి. మేము శివబాబా పిల్లలము, దేవతా పదవిని పొందేవారము, కనుక పరస్పరం ఎంత ప్రేమగా మాట్లాడుకోవాలి. కానీ పిల్లల నోటి నుండి ఇంకా పుష్పాలు వెలువడడం లేదు. మీరు ఎంత ఉన్నతమైనవారు. మనం శివబాబా సంతానమని, తర్వాత సత్యయుగంలో మహారాజులుగా అవుతామని మీకు గుర్తుండాలి. అనగా మనం విశ్వానికి కిరీటధారి రాకుమారులుగా తయారవుతాము.
మనం పరమాత్ముని సమ్ముఖంలో కూర్చొని ఉన్నామని పిల్లలైన మీకు లోలోపల సంతోషముండాలి. ఎవరి ద్వారానైతే స్వర్గ వారసత్వం లభిస్తుందో, వారి శ్రీమతాన్ని అనుసరించాలి. మన రాజధాని స్థాపనవుతుందని మీకు తెలుసు. రాజధానిలో అందరూ కావాలి. కానీ పిల్లలైన మీ నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి. బాబా రూప్ మరియు బసంత్. అన్ని కథలు ఇప్పటివే. తండ్రి జ్ఞానసాగరుడు. వారు జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. అంతేకానీ ఇంద్ర దేవుడు వర్షాన్ని కురిపిస్తారనే విషయమేమీ లేదు. ఈ మేఘాలు న్యాచురల్ గా తయారవుతాయి, వర్షాన్ని కురిపిస్తాయి. సత్యయుగంలో ఈ 5 తత్వాలు కూడా మీకు దాసిగా అవుతాయి. కానీ ఇక్కడి మనుష్యులు అన్నింటికీ బానిసలుగా అయిపోయారు. ఇక్కడ ప్రతి విషయంలో శ్రమ చేయాల్సి ఉంటుంది. అక్కడ అన్ని విషయాలు స్వతహాగా జరిగిపోతాయి. కావున పిల్లలకు బాబా స్మృతి సదా ఉండాలి. దీని ద్వారా సంతోషపు పాదరసం సదా ఎక్కి ఉంటుంది. వారు (సైన్స్ వారు) కూడా మథనం చేస్తారు. పిల్లలైన మీరు వాణిని మథనం చేయాలి. వాణి యొక్క ప్రవాహం ఒక్కోసారి చాలా బాగుంటుంది, ఒక్కోసారి తక్కువగా ఉంటుంది, దీనినే మథనం చేయడమని అంటారు. పిల్లలు తండ్రి అవస్థను చూస్తున్నారు మరియు బాబా వారి అనుభవాన్ని వినిపిస్తారు. అప్పుడప్పుడు చాలా ఉప్పొంగి ప్రవహిస్తుంది, అప్పుడప్పుడు తక్కువగా ఉంటుంది. అప్పుడప్పుడు చాలా మంచి పాయింట్లు వెలువడతాయి. బాబా కూడా సహాయకులుగా అవుతారు. ఇది మీరు కూడా అనుభవం చేస్తారు. బాబా మురళీని ఎప్పుడూ చేతిలోకి తీసుకోరు. పిల్లలు మ్యాగజైన్ ను రాసినప్పుడు, పిల్లలు ఏ పొరపాట్లు చేయడం లేదు కదా అని బాబా అప్పుడప్పుడు చూస్తారు. మ్యాగజైన్ లో కూడా మంచి-మంచి మురళీ పాయింట్లు వస్తూ ఉంటాయి మరియు అన్ని వైపులకూ వెళ్తూ ఉంటాయి. ఎవరి వద్దకైనా మురళీ చేరుకోలేదంటే, బాబా ఈ విధంగా అంటారు – రచయిత మరియు రచనల రహస్యాన్ని 7 రోజులలో తెలుసుకున్నారు కదా, ఇంకేం కావాలి అని. ఇక 5 వికారాలను భస్మం చేసే పురుషార్థం చేయాలి, ఇంకే కష్టము లేదు.
పిల్లలైన మీరు ఏ సత్సంగానికైనా వెళ్ళవచ్చు, సేవ చేయాలనే ఉల్లాసం కూడా రావాలి. అన్ని ధర్మాలవారు ఒక దగ్గరకు చేరుకున్నప్పుడు ప్రతి ఒక్కరి ధర్మం వేర్వేరు అని అర్థం చేయించాలి. భాయి-భాయి అని అంటారు కానీ అందరూ పరస్పరంలో కలిసి ఒకటి అవ్వడమనేది జరగదు. ఇది కేవలం చెప్పుకునే విషయం మాత్రమే. తండ్రి అంటారు – నేను వచ్చి బ్రాహ్మణులుగా తయారుచేసి, తర్వాత దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. అక్కడ వేరే ఏ ధర్మము ఉండదు. ఇది ఆ మహాభారత యుద్ధమే. గీతలో కూడా దీని గురించి వర్ణన చేయబడింది. ఈ చదువు ఒక్కటే. చదివించేవారు కూడా ఒక్కరే. జ్ఞానం పూర్తి అవ్వగానే నేను కూడా వెళ్ళిపోతాను అని తండ్రి అంటారు. నేను కలియుగ అంతిమంలో జ్ఞానాన్ని వినిపించాలి, నేను కల్ప-కల్పము రావాలి. ఒక్క సెకెండు కూడా ముందు వెనుక అవ్వదు. జ్ఞానము పూర్తి అయినప్పుడు కర్మాతీత అవస్థకు చేరుకుంటారు, అప్పుడు వినాశనం కూడా జరుగుతుంది. రోజు రోజుకు మీ సేవ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఎవ్వరిలోనూ పవిత్రత లేదు, దైవీ గుణాల ధారణ లేదు. అక్కడున్న పవిత్రతలో ఎంత తేడా ఉందో చూడండి. మీరిప్పుడు సంగమంలో కూర్చొని ఉన్నారు, ఇదే పురుషోత్తమ యుగము. ఇప్పుడు మీరు పురుషోత్తములుగా అవుతున్నారు కానీ ఆ నషా, ఆ నడవడిక కూడా ఉండాలి. నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు. నోటి నుండి రత్నాలే వెలువడాలి. ఇప్పుడు మీరు దేవతల వలె పుష్పాలుగా తయారవుతున్నారు. భగవంతుడు వచ్చి భగవాన్-భగవతీగా తయారుచేస్తారు. దేవతలనే భగవాన్-భగవతి అని అంటారు కానీ అలా ఎవరు తయారుచేస్తారు అనేది ఎవ్వరికీ తెలియదు. మీ బుద్ధిలో పూర్తి రచయిత మరియు రచనల జ్ఞానముంది, మరియు ఇతరులను తమ సమానంగా తయారు చేసే బాధ్యత ఉంది. చాలామంది వస్తూ ఉంటారు. స్వదర్శన చక్రధారులుగా బ్రాహ్మణులే అవుతారు. మాయా తుఫాన్లు కూడా పిల్లలకే వస్తాయి. ఒక్కోసారి తుఫాన్లు వచ్చినప్పుడు ఎముకలన్నీ విరిగిపోతాయి. నడుస్తూ-నడుస్తూ కొంతమంది డిస్ సర్వీస్ కూడా చేస్తారు. తండ్రి అంటారు – ఎలాంటి అశుద్ధమైన పనులు చేయకండి. మీరు ముఖవంశావళి బ్రాహ్మణులు, వారు కుఖవంశావళి వారు. ఎంత తేడా ఉంది. వారు భౌతిక యాత్రలకు తీసుకువెళ్తారు. మీది ఆత్మిక యాత్ర. మీరు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు. వారూ బ్రాహ్మణులే, మనము బ్రాహ్మణులమే, కానీ ఇరువురిలో సత్యమైన బ్రాహ్మణులెవరు అని అర్థం చేసుకునే తెలివి కూడా ఎవ్వరిలోనూ లేదు. ఆ బ్రాహ్మణులు తమను తాము బ్రహ్మాకుమారులని పిలుచుకోలేరు. మీరు స్వయాన్ని బ్రహ్మాకుమారులమని పిలుచుకుంటారు, కనుక తప్పకుండా బ్రహ్మా కూడా ఉంటారు. కానీ ఇవి అడగడానికి వారి బుద్ధిలోకి ఈ విషయాలు రావు. బాబా కల్ప-కల్పము వచ్చి పిల్లలైన మీకు ఈ విషయాలను అర్థం చేయిస్తారు. బ్రహ్మా సంతానమైన మీరు బ్రాహ్మణులు, మీరంతా సోదరీ-సోదురులు అయినట్లు. మరి మీరు వికారాలలోకి ఎలా వెళ్ళగలరు. ఒకవేళ ఎవరైనా వెళ్ళినట్లయితే, బ్రాహ్మణ కులానికి కళంకం తెచ్చిన వారవుతారు. తమను తాము బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలుగా పిలిపించుకున్న తర్వాత, ఇక మళ్ళీ పతితులుగా అవ్వకూడదు. అచ్ఛా.
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. వాణి ద్వారా ఏదైతే వింటారో, దానిపై మథనం చేయాలి. పురుషోత్తములుగా తయారవుతున్నారు కనుక నడవడికను చాలా రాయల్ గా తయారుచేసుకోవాలి. నోటి నుండి ఎప్పుడూ రాళ్ళు వెలువడకూడదు.
2. అనేకులను తమ సమానంగా తయారు చేసే బాధ్యత మీదిగా భావించి సేవలో తత్పరులై ఉండాలి. ఎలాంటి ఛీ-ఛీ అశుద్ధమైన పనులు చేసి డిస్ సర్వీసు చేయకూడదు.
వరదానము:-
ఎప్పుడైతే ఇంద్రియాల ఆకర్షణ మరియు సంబంధాల ఆకర్షణ నుండి ముక్తులుగా అవుతారో, అప్పుడు అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయగలరు. ఏ కర్మేంద్రియానికైనా వశమైన కారణంగా రకరకాల ఆకర్షణలు కలిగినట్లయితే, అవి అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేయడంలో మరియు సంతోషంగా ఉండడంలో విఘ్నాలను కలిగిస్తాయి. కానీ ఎప్పుడైతే బుద్ధి సర్వ ఆకర్షణల నుండి ముక్తిగా, ఒకే స్థానంలో నిలిచి ఉంటుందో, ఆందోళన సమాప్తమవుతుందో, అప్పుడు ఏకరస అవస్థ తయారై అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి కలుగుతుంది.
స్లోగన్:-
➤ Daily Murlis in Telugu: Brahma Kumaris Murli Today in Telugu
➤ Email me Murli: Receive Daily Murli on your email. Subscribe!